Gold (Image Credit To Original Source)
Union Budget 2026: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని రోజుల్లో యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ స్థిరత్వం, బలమైన దేశీయ డిమాండ్ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణ ఆధారిత వృద్ధికి ఊతమిచ్చేందుకు, కుటుంబాలు చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వానికి సరైన అవకాశం వస్తోంది.
ఈ బడ్జెట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) రంగానికి కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. సరైన విధాన మద్దతు లభిస్తే ఎన్బీఎఫ్సీలు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తాయి. ఇది చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలిగిస్తుంది.. కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే నాలుగు ఆచరణాత్మక ప్రతిపాదనలు ఉన్నాయి. గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీ రంగానికి చెందిన పరిశ్రమ వర్గాలు, ఆర్థిక నిపుణులు ఈ ప్రతిపాదనలు చేస్తున్నారు.
గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలకు “ప్రయారిటీ సెక్టార్ స్టేటస్”
తక్కువ మొత్తంలో రుణం తీసుకునే వ్యక్తులు లేదా సంస్థలు గోల్డ్ లోన్స్పై బాగా ఆధారపడుతున్నాయి. అధిక శాతం రుణాల విలువ రూ.50,000లోపే ఉంటుంది. ఈ నిధులు వైద్య ఖర్చులు, విద్య, వ్యవసాయ అవసరాలు, చిన్న వ్యాపారాల మూలధనం అవసరాలకు వినియోగిస్తారు.
ఇలాంటి రుణాలకు బ్యాంకులకు “ప్రయారిటీ సెక్టార్ స్టేటస్” ప్రయోజనాలు లభిస్తాయి. దీని వల్ల బ్యాంకులకు నియంత్రణ పరమైన సడలింపులు లభిస్తాయి. తక్కువ వడ్డీకి నిధులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలకు మాత్రం ఈ ప్రయోజనాలు అందడం లేదు. అర్హత ఉన్న గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలకు “ప్రయారిటీ సెక్టార్ స్టేటస్” ఇస్తే నిధుల వ్యయం తగ్గుతుంది. ఫలితంగా తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందించగలుగుతాయి.
యూపీఐ ద్వారా గోల్డ్-లింకెడ్ క్రెడిట్ లైన్లు
భారత్లో చెల్లింపుల వ్యవస్థను యూపీఐ పూర్తిగా మార్చింది. అయినప్పటికీ, రుణాలు పొందే అవకాశం ఇంకా పరిమితంగానే ఉంది. ఎన్బీఎఫ్సీల సహకారంతో యూపీఐ ద్వారా గోల్డ్-లింకెడ్ క్రెడిట్ లైన్లు ప్రవేశపెడితే ఈ లోటు తీరుతుంది. ఈ విధానంలో, వ్యక్తులు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి, యూపీఐ యాప్ల ద్వారా నేరుగా మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే రుణ సౌకర్యాన్ని పొందొచ్చు. అవసరమైనప్పుడు వెంటనే డబ్బు తీసుకునే వీలు ఉంటుంది.
గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలు-ఇతర ఎన్బీఎఫ్సీల మధ్య పోలిక
ప్రస్తుతం గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలకు ఇతర ఎన్బీఎఫ్సీలతో పోల్చితే ఒక్క కౌంటర్పార్టీపై కఠిన పరిమితులు ఉన్నాయి. అయితే బంగారు రుణాలు పూర్తిగా భద్రతతో ఉంటాయి. తిరిగి చెల్లింపు రికార్డు కూడా బలంగా ఉంది. టియర్ 1 మూలధనంలో 20 శాతం స్థాయికి పరిమితులను సమానంగా మార్చితే మంచి మూలధనంతో ఉన్న ఎన్బీఎఫ్సీలు తమ నిధులను సమర్థంగా వినియోగిస్తాయి.
ఎన్సీడీల్లో రిటైల్ పెట్టుబడులకు ప్రోత్సాహం
ఎన్బీఎఫ్సీలకు రిటైల్ పెట్టుబడిదారులు చాలా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న పన్ను నిబంధనలు పెట్టుబడిని అనవసరంగా సంక్లిష్టం చేస్తున్నాయి. లిస్టెడ్ నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లపై లభించే వడ్డీపై 10 శాతం టీడీఎస్ వర్తిస్తోంది. ఈ సాధనాలు స్టాక్ ఎక్స్చేంజ్లలో లావాదేవీ అవుతున్నా పెట్టుబడిదారులు భారాన్ని ఎదుర్కొంటున్నారు.
లిస్టెడ్ ఎన్సీడీలపై టిడిఎస్ నిబంధనలను సులభతరం చేస్తే రిటైల్ పాల్గొనడం పెరుగుతుంది. భద్రత కలిగిన ఎన్సీడి పబ్లిక్ ఇష్యూల్లో రిటైల్ పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లకు స్వల్పంగా ఎక్కువ వడ్డీ ఇవ్వడం ద్వారా కుటుంబ పొదుపులు పెరుగుతాయి. ఇది భారత్ మూలధన మార్కెట్ల అభివృద్ధికి సపోర్టు ఇస్తుంది.