Wealth Of Chandrababu Naidu's Wife Zooms Rs 535 Crore In 5 Days ( Image Credit : Google )
Heritage Foods Stock : దేశీయ స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్స్ ఆల్టైమ్ రికార్డులను సాధించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ కంపెనీ షేర్లపై భారీ లాభాలను అందుకుంది. ఇటీవల లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్ షేర్లు ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గత ఐదు రోజుల్లో 55 శాతం పెరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్థాపించిన ఈ కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది.
భువనేశ్వరి సంపద రూ. 535 కోట్లు.. నారా లోకేష్ సంపద రూ. 237.8 కోట్లు :
ఎన్నికల ఫలితాల ప్రకటనకు కొన్ని గంటల ముందు.. జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ రూ. రూ.424 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు (శుక్రవారం) రూ.661.25 దగ్గర ట్రేడ్ అయింది. బీఎస్ఈ డేటా ప్రకారం.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టాప్ షేర్ హోల్డర్గా నిలిచారు. ఆమె మొత్తం 2,26,11,525 స్టాక్లను కలిగి ఉన్నారు.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హెరిటేజ్ ఫుడ్స్లో 1,00,37,453 షేర్లను కలిగి ఉన్నారు. స్టాక్ పెరిగిన తర్వాత భువనేశ్వరి సంపద 5 రోజుల్లో రూ. 535 కోట్లు, నారా లోకేష్ నికర విలువ కూడా రూ. 237.8 కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్లో చంద్రబాబు కుటుంబానికి మొత్తం 35.7 శాతం వాటా ఉంది.
1992లో హెరిటేజ్ ఫుడ్స్ ప్రారంభం :
చంద్రబాబు నాయుడు 1992లో హెరిటేజ్ ఫుడ్స్ను స్థాపించారు. కంపెనీ వెబ్సైట్ దీనిని “భారత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పబ్లిక్-లిస్టెడ్ కంపెనీలలో ఒకటి”గా అభివర్ణించింది. అంతేకాదు.. బాబు ఫ్యామిలీకి ఈ కంపెనీలో డెయిరీ, రిన్యువబుల్ ఎనర్జీ అనే రెండు వ్యాపార విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం, హెరిటేజ్ పాలు, పాల ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఎన్సీఆర్ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో మార్కెట్ భారీగా విక్రయిస్తోంది.
ఎన్డీఏ గెలుపులో టీడీపీ కీలక పాత్ర :
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే భారీ ఉత్కంఠ మొదలైంది. టీడీపీ పోటీ చేసిన 17 స్థానాల్లో 16 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపులో కీలకపాత్ర పోషించింది. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయే 293 స్థానాలను గెలుచుకుంది. గత రెండు పర్యాయాల్లో అద్భుతమైన మెజారిటీ సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్కు కన్నా 240 సీట్లు మాత్రమే సాధించింది.