దారుణం……వ్యక్తిని కొట్టి చంపిన దుండగులు
- murthy
- Published On : November 20, 2020 / 08:03 PM IST
man beaten to death unidentified people : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒకవ్యక్తిని కర్రలతో విచక్షణా రహితంగా కొట్టి హతమార్చారు. గుట్ట మల్లారంలోని బ్రహ్మంగారి గుట్ట సమీపంలోని గుట్టల్లో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతుడ్ని షేక్ యాకుబ్ పాషా గా గుర్తించారు.
ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా పని చేసే పాషా గురువారం రాత్రి అశ్వాపురంలో ఓ వివాహా వేడుకకు వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు కర్రలతో విచక్షణా రహితంగా కొట్టటంతో తీవ్రగాయాలతో గుట్టమల్లారంలో శవమై తేలాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
