Attempt Murder : కృష్ణాజిల్లా దివిసీమలో పాతకక్షలు పడగ విప్పాయి. కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన రేపల్లె ప్రతాప్ అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసారు. నిన్న సాయంత్రం ప్రతాప్ అవనిగడ్డ నుంచి వి.కొత్తపాలెం తన ఇంటికి వెళ్తుండగా నిందితులు దారికాచి కళ్లలో కారం కొట్టి కత్తులతో తనపై దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు.
Also Read : Heavy Rains Effect : భారీ వర్షాలకు భూమిలోకి కుంగిన మూడంతస్తుల భవనం
అక్కడి నుంచి తప్పించుకుని పారిపోబోతుండగా వెంటపడి కత్తులతో పొడిచారని బాధితుడు చెప్పాడు. పాత కక్షల నేపథ్యంలోనే తన గ్రామానికే చెందిన రేపల్లె రాము, ఎలవర్తి మల్లికార్జునరావు మరి కొంతమంది కలిసి తనపై దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. వి. కొత్తపాలెం గ్రామంలో 2014 లో జరిగిన హత్యలో ప్రధాన నిందితుడిగా రేపల్లె ప్రతాప్ ఉన్నాడు.
ప్రత్యర్ధుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రతాప్ను స్ధానికులు అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. సమాచారం తెలుసుకున్న అవనిగడ్డ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితుడి నుంచి దాడి జరిగిన సంఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.