కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ లోని దక్షిణ సియాచిన్ గ్లేసియర్ సెక్టార్ లో హిమపాతంలో చిక్కుకుని భారత ఆర్మీ గస్తీ బృందానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో 18,000 అడుగుల ఎత్తులో గస్తీ తిరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు శ్రీనగర్ కు చెందిన రక్షణ ప్రతినిధి తెలిపారు.
సమాచారం తెలిసిన వెంటనే అవలాంచీ రెస్క్యూ టీమ్(ART) ఘటనా స్థలికి చేరుకుంది. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు. హిమపాతంలో గస్తీ బృందం చిక్కుకున్న ప్రాంతాన్ని తొలుత గుర్తించిన సహాయక బృందం దట్టమైన మంచులో కూరుకుపోయిన సిబ్బందిని వెలికి తీశారు. అప్పటికే ఇద్దరు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, సురక్షితంగా వెలికి తీసిన మిగిలినవారిని హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ బేస్ క్యాంప్ కు ట్రీట్మెంట్ కోసం తరలించినట్లు ఆయన తెలిపారు.