Honour Killing : మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. సిద్ధిపేట జిల్లా లకుడారంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసారు. ఈ కేసులో ఇప్పటివరకూ 13 మందిని అదుపులోకి తీసుకున్నారు భువనగిరి పోలీసులు.
రామకృష్ణ హత్యకేసులో ప్రధాన సూత్రధారి మామ వెంకటేష్గా గుర్తించారు. రామకృష్ణ మృతదేహంపై గాయాలున్నట్లు రాచకొండ పోలీసు కమీషనరేట్ నుంచి వచ్చిన క్లూస్ టీం గుర్తించారు. ఘటనా స్ధలం నుంచి ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఎప్పుడు హత్య చేశారు ? ఎక్కడ హత్య చేశారు ? ఇక్కడకు ఎప్పుడు తీసుకువచ్చి పడేశారు ? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. భువనగిరి ఏసీపీ, సిధ్దిపేట ఏసీపీ సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తుచేస్తున్నారు.
రామకృష్ణ హత్య కేసులో లతీఫ్ గ్యాంగ్ రామకృష్ణను నెలరోజులుగా ట్రాప్ చేస్తోంది. తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో రామకృష్ణను చంపేయాలని అతని మామ వెంకటేశ్… లతీఫ్ గ్యాంగ్ను ఆశ్రయించాడు. దీంతో నెలరోజులుగా రామకృష్ణను లతీఫ్ ట్రాప్ చేశాడు. దుబాయ్ నుంచి వచ్చానని, స్థలం కావాలని నమ్మించాడు. 5వేలు డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. రెండ్రోజుల క్రితం రామకృష్ణను జిమ్మాపూర్ సర్పంచ్ అమృతరావు ఇంటినుంచి పిలుచుకుని వెళ్లాడు. ఆ తర్వాత రామకృష్ణ ఇంటికి రాలేదు.
దీంతో అతడి భార్య భార్గవి అమృతరావుకు ఫోన్ చేసింది. అయితే తనకేం తెలియదని చెప్పాడు. దీంతో భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రామకృష్ణను నమ్మించి మోత్కూరు తీసుకెళ్లిన లతీఫ్ గ్యాంగ్… జమిచెట్టు బావి దగ్గర హత్య చేసారు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి సిద్ధిపేట జిల్లా లకుడారం గ్రామ సమీపంలో పూడ్చిపెట్టారు. ఈకేసులో వెంకటేష్ లతీఫ్ తో 10 లక్షల రూపాయలు సుపారీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
కేసు పూర్వపరాలు పరిశీలిస్తే …వెంకటేష్ వీఆర్వో గా పని చేస్తున్నాడు.. రియల్ ఎస్టేట్ భూముల వ్యవహారంలో తన దగ్గరకు వచ్చిన వారికి సాయం చేసేవాడు. లిటిగేషన్ భూముల సెటిల్మెంట్లలో రామకృష్ణగౌడ్కు అలానే హెల్ఫ్ చేశాడు. రామకృష్ణ పోలీస్ శాఖలో హోంగార్డు, వెంకటేష్ వీఆర్వో కావడంతో…. లిటిగేషన్ భూముల అంశాన్ని క్యాష్గా చేసుకుని ఎన్నో సెటిల్మెంట్లు చేశారు.
అదే సమయంలో ఇష్టంగా పెంచుకున్న కూతురు తన సెటిల్మెంట్ పార్ట్నర్ రామకృష్ణగౌడ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అప్పటి నుంచి రామకృష్ణగౌడ్పై పగ పెంచుకున్నాడు మామ వెంకటేష్. తాజాగా అదును చూసి అంతమొందించాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ పరువు హత్య కలకలం రేపుతోంది. 2020 ఆగస్టు 16న భార్గవితో రామకృష్ణగౌడ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో అప్పటినుంచి రామకృష్ణపై భార్గవి తండ్రి పగపెంచుకున్నాడు.
Also Read : Honour Killing : యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య ?
అదును కోసం రెండ్రోజుల క్రితం రామకృష్ణగౌడ్ను హైదరాబాద్కు పిలుపించుకున్నాడు. ఆ తర్వాత నుంచి రామకృష్ణగౌడ్ కనిపించకుండా పోయాడు. దీనిపై ఆయన భార్య భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతలోనే రామకృష్ణగౌడ్ హత్యకు గురికావడంతో ఆమె కన్నీరు మున్నీరవుతోంది. సిద్దిపేట జిల్లా లకుడారం గ్రామం పరిధిలో రామకృష్ణగౌడ్ మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. పరువు హత్యతో ఆ చిన్నారి తండ్రి లేని అనాథగా మిగిలిపోయింది.
రామకృష్ణగౌడ్ను ఎక్కడ హత్య చేశారు..? ఈ మర్డర్లో ఎంతమంది పాల్గొన్నారు..? ఎందుకు హత్య చేశారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ హత్యకు పరువు హత్యే కారణమా..? లేక రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలు కారణమా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.