Delhi Robbery : రూ.6 కోట్ల విలువైన నగల దోపిడీని పట్టించిన రూ.100 పేటీఎం ట్రాన్స్‌ఫర్

ఎంత పెద్ద నేరం చేసినా చిన్న క్లూ పట్టించేస్తుంది. అదే జరిగింది ఢిల్లీలో జరిగిన బంగారు నగల దోపిడీలో. ఆరు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాలు, వెండి నగల దోపిడీని కేవలం రూ.100లు పట్టించింది. కోట్ల రూపాయలు విలువ చేసే నగలు దోపిడీ అయితే చేశారు గానీ టీ తాగటానికి జేబులో డబ్బులు లేకపోవటం ఆ దొంగల కొంప ముంచింది. రూ.100లు పేటీఎం చేసి అడ్డంగా దొరికిపోయారు దోపిడీగాళ్లు.

Delhi Robbery

Delhi Robbery : ఎంత పెద్ద నేరం చేసినా చిన్న క్లూ పట్టించేస్తుంది. అదే జరిగింది ఢిల్లీలో జరిగిన బంగారు నగల దోపిడీ నేరంలో. ఆరు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాలు, వెండి నగల దోపిడీని కేవలం రూ.100లు పట్టించింది. కోట్ల రూపాయలు విలువ చేసే నగలు దోపిడీ అయితే చేశారు గానీ టీ తాగటానికి జేబులో డబ్బులు లేకపోవటం ఆ దొంగల కొంప ముంచింది. రూ.100లు పేటీఎం చేసి అడ్డంగా దొరికిపోయారు దోపిడీగాళ్లు. 15 రోజుల రెక్కీ..పక్కా ప్లాన్ తో కొట్టేసిన ఆరు కోట్ల రూపాయల విలువైన నగల దోపిడీగాళ్లు వంద రూపాయలు పట్టించాయి.

ఈ దోపిడీకి సంబంధించి సెంట్రల్‌ డీసీపీ శ్వేత చౌహాన్ వివరాల ప్రకారం..సెంట్రల్ ఢిల్లీలోని పహర్ గంజ్ ఏరియాలో ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీ ఉంది. ఖరీదైన వస్తువులను..ఆభరణాలు ఈ కంపెనీ దేశంలోని నలుమూలకు కొరియర్ చేస్తుంటుంది. కోట్లాది విలువైన ఆభరణాలకు కూడా కొరియర్ చేస్తుంటుంది. సోమ్‌వీర్‌ అనే వ్యక్తి చండీగఢ్‌లోని ఓ పార్సిల్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటారు. తన సహోద్యోగితో కలిసి బుధవారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో పహాడ్‌గంజ్‌లోని సంస్థ కార్యాలయం నుంచి పార్సిళ్లను తీసుకొని వెళ్తున్నాడు.

అప్పటికే రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో రెడీగా నలుగురు దుండగులు దోపికీ చేయటానికి రెడీగా ఉన్నారు. కొద్ది దూరంలో అప్పటికే ఇద్దరు యువకులు కాపు కాచి ఉన్నారు. అందులో ఒకరు పోలీసు యూనిఫాం ధరించి ఉన్నాడు. తనిఖీల పేరిట ఈ ఇద్దరిని వారు అడ్డుకున్నారు. అంతలోనే.. మరో ఇద్దరు నిందితులు వారికి జతయ్యారు. ఈ క్రమంలో దుండగులు ఉద్యోగుల కళ్లలో కారం చల్లి.. విలువైన ఆభరణాలు ఉన్న పార్సిళ్లతో పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా ఘటనాస్థలం..పరిసరాల్లో దాదాపు 700 సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు.

ఈ క్రమంలోనే ఘటనాస్థలానికి సమీపంలో నలుగురు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వారు ఓ క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడటం కనిపించింది. అందులో ఒకరు చాయ్‌ తాగేందుకు చేతిలో డబ్బుల కోసం పేటీఎం ద్వారా క్యాబ్‌ డ్రైవర్‌కు రూ.100 ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు గుర్తించారు. ఆ లావాదేవీని విశ్లేషించగా.. నిందితులు దిల్లీలోని నజఫ్‌గఢ్‌వాసులుగా తేలింది. దోపిడీ అనంతరం వారు రాజస్థాన్‌కు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో జైపూర్‌ వెళ్లిన ఓ పోలీసు బృందం.. నగేశ్‌ కుమార్‌, శివం, మనీశ్‌ కుమార్‌లను అరెస్టు చేసింది.

వారి వద్ద నుంచి దాదాపు రూ.ఆరు కోట్ల విలువైన మొత్తం 6,270 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి, ఐఐఎఫ్‌ఎల్‌లో డిపాజిట్‌ చేసిన 500 గ్రాముల బంగారం, 106 ముడి వజ్రాలు, ఇతర వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరొకరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దోపిడీకి సూత్రధారి అయిన నగేష్.. తన స్నేహితులు, బంధువులతో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డాడని డీసీపీ వెల్లడించారు.