కుటుంబంలో గొడవల కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న యువతిని పోలీసులు కాపాడారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన యువతి ఇంట్లో గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇంట్లో నుంచి బయలు దేరిన యువతి గోదావరి బ్రిడ్జి వైపు నడుచుకుంటూ వచ్చింది. లాక్ డౌన్ కారణంగా పెట్రోలింగ్ లో ఉన్న ఎస్సైలు విజేందర్, మంగిలాల్ లు ఆమెను గుర్తించి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.
ఆ యువతిని సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమెను ఇంటివద్ద తల్లితండ్రులకు అప్పగించారు. విపరీతమైన భావోద్వేగాలు మానసికి సంక్షోభానికి దారితీస్తాయని… దాని వల్ల గొడవలు జరుగుతాయని, తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుందని, ఇది ఎవరికైనా హానికరమే అని డీజీపీ ఈ ఘటనపై తన ట్విట్టర్లో స్పందించారు.
క్షణికావేశంలో చావాలన్న నిర్ణయాలు మంచివి కావు. ఓ క్షణం ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొంత సమయాన్ని కేటాయిస్తే ఎటువంటి సమస్యలైనా పటాపంచలు అవుతాయన్నారు. అమ్మాయి ప్రాణాలు కాపాడిన పోలీసుల్ని కూడా తన ట్వీట్లో డీజీపీ విశేషంగా కొనియాడారు.
వారిని డియర్ ఆఫీసర్స్ అని సంబోధిస్తూ.. సరైన సమయంలో సమస్యను గుర్తించి, మంచి మాటలతో మానసికంగా కుంగిపోయిన అమ్మాయిని రక్షించారన్నారు. ఎస్సైలు విజేందర్, మంగీలాల్ ప్రదర్శించిన సమయస్పూర్తికి కితాబిచ్చారు.