Rash Driving: హైదరాబాద్ లో ఘోరం.. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

మృతి చెందిన ఇద్దరు యువకులు మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన సందీప్, శివలుగా గుర్తించారు పోలీసులు.

  • Published On : April 8, 2026 / 04:31 PM IST
  • హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్
  • బైక్ ను బలంగా ఢీకొట్టిన కారు
  • స్పాట్ లోనే ఇద్దరు స్టూడెంట్స్ మృతి
  • నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు

Rash Driving: హైదరాబాద్ వనస్థలిపురంలోని హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరి ప్రాణాలు తీశాడు. నడుచుకుంటున్న వెళ్తున్న వ్యక్తిని, బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను కారుతో బలంగా ఢీకొట్టాడు. 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అదే వేగంతో కారు పల్టీ కొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు స్పాట్ లోనే చనిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని శ్రీధర్ (23) గా గుర్తించారు. ప్రస్తుతం అతడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతి చెందిన ఇద్దరు యువకులు మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన సందీప్ జోయల్(19), కె.శివ (19)లుగా గుర్తించారు పోలీసులు. వీరిద్దరూ ఈసీఈ సెకండియర్ చదువుతున్నారు. వీరిద్దరూ బైక్ పై వెళ్తున్నారు. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన హోండా సిటీ కారు.. విద్యార్థుల బైక్ ను బలంగా ఢీకొట్టింది. అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలతో విద్యార్థులు ఇద్దరూ ఘటనా స్థలంలోనే చనిపోయారు. తమ స్నేహితులు మృతి చెందారని తెలుసుకున్న తోటి కాలేజీ విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని తమకు అప్పగించాలంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. కాగా, ఈ ఘోర ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే ప్రాణాంతక పరిణామాలను ఎత్తిచూపుతుంది. నగరంలో రహదారి భద్రత, అమలుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా, తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ఫుల్లుగా తాగి వాహనంతో రోడ్డు ఎక్కుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ తో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.

Also Read: విశాఖ ఫ్రిడ్జ్‌లో గర్ల్‌ఫ్రెండ్ డెడ్‌బాడీ కేసులో ట్విస్ట్