Widow killed in Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు లో దారుణం చోటు చేసుకుంది. వితంతు కోడలిపై, మామ విచక్షణా రహితంగా రోకలిబండతో దాడి చేసి హత్య చేసిన ఘటున వెలుగు చూసింది. కన్న తండ్రిలా కాపాడాల్సిన మామ కర్కశంగా మారిపోయి కోడలి పై రోకలి బండ తో దాడి చేయటంతో ఆ కోడలు మరణించింది.
పాత గుంతకల్లు లోని అంకాలమ్మ కాలనీ కు చెందిన పరమేష్ కు ఏడేళ్ల క్రితం, కనేకల్లు మండలం సల్లాపురం గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం జ్యోతి భర్త పరమేష్ అనారోగ్యంతో క్యాన్సర్ బారినపడి మరణించాడు. అప్పటినుండి జ్యోతి అత్తమామల వద్ద ఉంటూ తన జీవనం కొనసాగిస్తూ ఉండేది. అయితే మూడు నెలల క్రితం ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈరోజు ఉదయం ప్రభుత్వం నుంచి వచ్చే వితంతు పెన్షన్ తీసుకునేందుకు ఆమె గుంతకల్లు లోని తమ మామ ఇంటి వద్దకు వచ్చింది.
Also Read :Tirumala Sri Vari Darshan : ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ ద్వారా శ్రీవారి దర్శనం
ఆ సందర్భంలో మామ, కోడలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మామ మల్లికార్జున కోడలిపై రోకలి బండతో దాడిచేసి, ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మామ కోట్టిన దెబ్బలకు బాధితురాలు ఘటనా స్ధలంలోనే కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్ధానికులు బాధితురాలిని మొదట గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జ్యోతి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.