Fire Accident in Delhi : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. తొమ్మిది నెలల చిన్నారిసహా నలుగురు మృతి
తూర్పు ఢిల్లీలోని షాహదారా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మినెలల చిన్నారిసహా నలుగురు మరణించారు.
- Harish Thanniru
- Published on- January 27, 2024 / 08:49 AM IST
Fire Accident in Delhi
Fire Accident : ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మినెలల చిన్నారిసహా నలుగురు మరణించారు. తూర్పు ఢిల్లీలోని షాహదారా ప్రాంతంలోని నివాస భవనంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది నెలల పసిపాపతో పాటు నలుగురు వ్యక్తులు ఊపిరాడక మరణించారు. మృతుల్లో ప్రథమ్ సోనీ (17), రచన (28), గౌరీ సోనీ (40), రూహి (తొమ్మిది నెలలు)గా గుర్తించారు. మృతులు కాకుండా మరో ఇద్దరు మంటల్లో భవనంలో చిక్కుకోగా.. వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిద్దరికి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే, వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఎంఎస్ పార్క్ పోలీస్ స్టేషన్ సిబ్బంది స్థానికుల సహాయంతో భవనంపై నుంచి ముగ్గురిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటన స్థలంకు వెంటనే ఐదు ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. భవనం గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులను కలిగి ఉంది. ఇంటి యాజమాని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు తనకోసం వినియోగించుకుంటున్నాడు. మిగిలిన రెండు అంతస్తులు అద్దెకు ఇచ్చాడు. అయితే, మంటలు ఎలా వ్యాపించాయి, ఈ ఘటనకు కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
