ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన మరువకముందే మరో దారుణం ఘటన జరిగింది. కోల్కతాలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు.
మహిళలపై జరుగుతున్న వరుస ఆఘాయిత్యాలతో దేశం వణికిపోతోంది. హైదరాబాద్ షాద్నగర్లో డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా మరిన్ని ఘోరాలు వెలుగు చూశాయి. ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన మరువకముందే మరో దారుణం ఘటన జరిగింది. కోల్కతాలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు. దక్షిణ కోల్కతాలోని కాలీఘాట్ ఆలయం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కూడా మైనర్ బాలురు నిందితులు కావడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలీఘాట్ ఆలయం దగ్గర ఇద్దరు బాలికలు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గురువారం(నవంబర్ 28, 2019) సాయంత్రం ముగ్గురు బాలురు… ఆ ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం మాచండి ఆశ్రమానికి సమీపానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆది గంగా దగ్గర బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యారు. దీంతో బాధిత బాలికల తల్లిదండ్రులు కాలిఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధిత బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బాలికలను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనాస్థలి నుంచి మరిన్ని ఆధారాలు సేకరించడానికి ప్రయత్నిస్తోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.