పది లక్షలు ఇచ్చి, విడాకులు ఇస్తే వెళ్లిపోతా…….. భార్య బెదిరింపు, హత్య చేసిన భర్త

  • Published On : January 22, 2021 / 11:37 AM IST

husband kills wife, over suspicion of illicit affairs :  అప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరి ద్వారా ముగ్గురు పిల్లలు కలిగారు. ఇద్దరు భర్తలను వదిలేసి మూడో వాడితో తాళి కట్టించుకుంది. చివరికి వాడి చేతిలోనే హతమయ్యింది.

మహారాష్ట్రకు చెందిన పర్హానా ఖురేషి(25) అనే మహిళ ఇద్దరు భర్తలను వదిలేసి, ఇద్దరు కొడుకులు కూతురుతో కలిసి నాందేడ్ లో నివసిస్తూ ఉండేది. రెండేళ్ల క్రితం ఆమెకు బీదర్ కు చెందిన కిరోసిన్ డీలర్ మహ్మద్‌ మోసిన్‌ ఖాన్‌(31) పరిచయమయ్యాడు. ఆ పరిచయం తర్వాత ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు.  గతేడాది జులై నెలలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

అక్కడి నుంచి మకాం హైదరాబాదా కు మార్చారు.  పిల్లలతో కలిసి అంజయ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు.  ఇదిలా ఉండగా మోసిన్ కు తెలియకుండా పర్హాన బయటకు వెళ్లి వస్తూ ఉండేది. దీంతో మోసిన్ కు భార్య ప్రవర్తనపై అనుమానం పెరిగింది. ఆమె వేరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానం రాను రాను బలపడసాగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి.

జనవరి 20, బుధవారం భార్య మోసిన్ కు తెలియకుండా బయటకు వెళ్లి వచ్చింది.  ఆ రోజు రాత్రి మళ్లీ భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. భార్యను గట్టిగా నిలదీయటంతో   రూ.10 లక్షలు ఇచ్చి, విడాకులు ఇస్తే తన దారిన తాను వెళ్ళి పోతానని పర్హాన భర్తకు తెగేసి చెప్పింది. ఆమె మాటలకు కోపం పెరిగిపోయిన మోసిన్‌ ఖాన్‌ కూరగాయల కత్తితో భార్య కడుపులో రెండు చోట్ల పొడిచాడు. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశాడు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు బాత్‌ రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న పర్హనా ఖురేషీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్థ రాత్రి తరువాత  ఆమె మృతి చెందింది. నిందితుడు మహ్మద్‌ మోసిన్‌ ఖాన్‌ను  పోలీసులు అరెస్ట్‌ చేశారు.