Kamareddy News: కామారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దంపతులు సహా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఆ ఘటనల తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కొత్తకురుమ సిద్ధరాములు అనే రైతు పొలం గట్టు విషయంలో జరిగిన గొడవలో మనస్తాపం చెంది.. చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దరాములు పొలం గట్టును ఆక్రమించిన ధాత్రిక రమేష్..ఇరువురి పొలం గట్టు పై సరిహద్దు రాళ్ళు పేర్చి వెళ్ళాడు. ఐదు రోజుల క్రితం రెండు సరిహద్దు రాళ్ళు ధ్వంసం కావడంతో సదరు రైతు రమేష్ బిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Also read: Kamareddy : 70 రూపాయల కోసం ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం..60 శాతం కాలిపోయిన శరీరం
ఈ విషయమై సిద్ధరాములును పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో పరువుపోయిందని భావించిన సిద్దరాములు మనస్తాపానికి గురై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సోమవారం ఉదయం సమాచారం అందుకున్న బిక్కనూర్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సిద్దరాములు మరణానికి కారణమైన రమేష్ ను అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు పట్టుబట్టారు. మృతదేహాన్ని తరలించకుండా పోలీసులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
Also read: Bandi Sanjay : పర్మినెంట్ ఎప్పుడు చేస్తారు? సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ
దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక మరో ఘటనలో.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నామాల శంకర్ (45) నామాల సుజాత (35) అనే దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న రామారెడ్డి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దంపతులకు ఆరేళ్ళ కుమారుడు ఉన్నాడు. ఇద్దరి మృతితో బాలుడు ఒంటరిగా మిగిలాడు.