Karnataka : భార్య అందంగా తయారవుతోందని.. నలుగురు స్నేహితులతో కలిసి భర్త దారుణం..
ఆమెకు అందంగా తయారు అవ్వడం ఇష్టం. మోడ్రన్గా, స్టైల్గా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది
- Thota Vamshi Kumar
- Published On : August 15, 2024 / 07:37 AM IST
Karnataka Woman dies for This Reason Full Details Here
ఆమెకు అందంగా తయారు అవ్వడం ఇష్టం. మోడ్రన్గా, స్టైల్గా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే.. ఆమె భర్తకు మాత్రం అలాంటివి ఇష్టం ఉండదు. పద్దతిగా ఉండాలని చెబుతూ ఉంటాడు. ఈ క్రమంలో పలుమార్లు వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. అతడి మాటలు, వేధింపులతో విసిగిపోయిన ఆమె విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణకు హాజరైన అతడు తాను మారిపోయానంటూ భార్యను నమ్మించాడు.
భర్త మారాడు అంటే ఆమె ఎంతో సంతోష పడింది. అతడితో కలిసి ఉండాలని అనుకుంది. గుడికి అంటూ ఓ కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడు. ఈ దారణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రామనగర జిల్లా మాగడికిలో ఉమేశ్, దివ్య (32) దంపతులు నివసిస్తున్నారు. అందంగా కనబడడం కోసం దివ్య ఎప్పుడూ లిప్స్టిక్ వేసుకుంటూ ఉండేది. ఓ టాటూ కూడా వేసుకుంది. ఆమె చేసే పనులు ఉమేశ్కు నచ్చేవి కావు. దీంతో ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. భర్త వేధింపులు, అనుమానాలు రోజు రోజుకి ఎక్కువ అవుతుండడంతో కొన్ని రోజుల క్రితం దివ్వ మాగడి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసింది.
మంగళవారం భార్యాభర్తలు ఇద్దరూ విచారణకు హజరు అయ్యారు. ఇక పై అనుమానించను అంటూ దివ్యను ఉమేశ్ నమ్మించాడు. భర్త మారాడు అనుకుని ఆమె సంతోషంలో మునిగిపోయింది. అతడితో కలిసి ఊజగల్లు దేవాలయానికి వెళ్లింది. ఆమెను హత్య చేయాలని ముందే నిశ్చయించుకున్న ఉమేశ్.. దర్శనం అనంతరం ఓ కొండ వద్దకు దివ్యను తీసుకువెళ్లాడు. పథకం ప్రకారం అప్పటికే అక్కడ అతడి నలుగురు స్నేహితులు ఉన్నారు.
వారంతా కలిసి దివ్యను హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఉమేశ్తో పాటు మరొకరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
