కోడి కత్తి కేసులో బెయిల్.. నిందితుడు శ్రీనివాస్కు హైకోర్టు విధించిన షరతులు ఇవే..
నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి హైకోర్టు లాయర్ వివరించారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 8, 2024 / 03:37 PM IST
kodi kathi case andhra pradesh high court bail conditions for accused
kodi kathi case : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జనుపల్లి శ్రీనివాస్కు ఏపీ హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 20218, అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అప్పటి విపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ పై కోడి కత్తితో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్టైన అతడు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు ఎన్ఐఏ కోర్టును అభ్యర్థించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఉన్నత న్యాయస్థానం అతడికి తాజాగా బెయిల్ మంజూరు చేసింది.
శ్రీనివాస్ బెయిల్ కోసం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో 8 సార్లు పిటిషన్ దాఖలు చేశామని హైకోర్టు లాయర్ గగన సింధు 10టీవీతో చెప్పారు. జగన్పై దాడి సమయంలో విశాఖపట్నం ఎయిర్పోర్టులో విధులు నిర్వహించిన అధికారి సాక్ష్యం చెప్పారని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదని వెల్లడించారు. మొదట ఈ కేసు విశాఖపట్నం కోర్టులోనే విచారణ చేశారని, తర్వాత ఎన్ఐఏ పరిధిలోకి రావడంతో విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారని చెప్పారు. కొంత కాలం క్రితం విశాఖపట్నంలో ఎన్ఐఏ కోర్టు పెట్టడంతో ఈ కేసును మరోసారి అక్కడికి బదిలీ చేశారని తెలిపారు.
Also Read: ఏపీలో ఏ పథకమూ ఆగదు.. మేం మరింత ఇస్తాం.. అంతేకాదు..: పవన్ కల్యాణ్
కాగా, విశాఖ జైలు నుంచి రేపు శ్రీనివాస్ విడుదలయ్యే అవకాశముంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి లాయర్ సింధు వివరించారు. షరతులు అతిక్రమిస్తే హైకోర్టు బెయిల్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
చేయకూడనివి
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో నిందితుడు శ్రీనివాస్ మాట్లాడకూడదు.
ఎలాంటి ర్యాలీలు, సభలకు వెళ్లరాదు.. మాట్లాడకూడదు.
చేయాల్సినవి
25000 రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలు ఇవ్వాలి
ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో ప్రతి ఆదివారం హాజరై సంతకం చేయాలి
