Madhapur Firing Case : మాదాపూర్లో కలకలం రేపిన రియల్టర్ కాల్పుల కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఇస్మాయిల్ హత్య కేసు నిందితులను అరెస్ట్ చేశారు. ముజాయిద్, మహ్మద్ జిలానీ, మహ్మద్ ఫిరోజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు…రెండు కంట్రీమేడ్ పిస్టళ్లు, ఏడు రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తితో పాటు కారు, బైక్ను సీజ్ చేశారు.
పాతబస్తీ కాలాపత్తర్లోని నవాబ్కుంటకు చెందిన రౌడీషీటర్ ఇస్మాయిల్, అతని స్నేహితుడు జహంగీర్పై కాల్పులు జరిపింది ముజాయిద్, జిలానీ, ఫిరోజ్ గ్యాంగ్. నీరూస్ జంక్షన్ ..హండ్రెడ్ ఫీట్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల కేసును మాదాపూర్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నిందితుల కోసం 5 పోలీస్ టీమ్లు విస్తృతంగా గాలించాయి. జహీరాబాద్లో ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఇస్మాయిల్ హత్యకు జహీరాబాద్లోని భూ వివాదమే కారణమని దర్యాప్తులో తేలింది.
మహ్మద్ ఇస్మాయిల్ …పోచంపల్లి, దుండిగల్కు చెందిన ముజాయిద్, జిలానీ, ఫిరోజ్ఖాన్తో కొంతకాలంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ల్యాండ్ సెటిల్మెంట్లూ చేసేవారు. జహీరాబాద్లో మూడు ఎకరాలు కొన్నారు…కానీ ఇందులోని 200 గజాల స్థలం విషయంలో ఇస్మాయిల్, ముజాయిద్కు మధ్య కొంతకాలంగా పంచాయితీ నడుస్తోంది. సెటిల్మెంట్ చేసుకుందామని ఆదివారం అర్ధరాత్రి మాదాపూర్ చేరుకున్నారు. ఇస్మాయిల్ వెంట జహంగీర్ ఉంటే.. నిందితులు కారులో, బైక్పై వచ్చారు.
సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు హండ్రెడ్ ఫీట్ రోడ్డులో టిఫిన్లు తిన్నారు. ఆ తర్వాత ముజాయిద్, ఇస్మాయిల్కు ల్యాండ్ విషయంలో గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. జహంగీర్ ఆపేందుకు యత్నించాడు. కానీ జిలానీ పిస్టల్తో ఇస్మాయిల్ తలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో కుప్పకూలిన ఇస్మాయిల్ను హాస్పిటిల్కు తీసుకెళ్లేసరికే చనిపోయాడు. వెంటనే నిందితులు పరారయ్యారు కానీ జహీరాబాద్లో కారును గుర్తించి పోలీసులు..చేవెళ్ల రోడ్డులో వెళ్తుండగా అరెస్ట్ చేశారు.
Also Read : Hyderabad : ఎస్సైని కత్తితో పొడిచి పరారైన దుండగులు