మచిలీపట్నంలో వెలుగులోకి వచ్చిన కామాంధుడి అకృత్యాలు.. పోలీసులకు మైనర్ బాలిక ఫిర్యాదు

తండ్రి వయసున్న కీచకుడి నుంచి తనకు రక్షణ కల్పించాలని మచిలీపట్నం పోలీసులను ఓ మైనర్ బాలిక వేడుకుంది.

machilipatnam police station: కామాంధుడు నుంచి కాపాడమంటూ కృష్ణాజిల్లా మచిలీపట్నం లో ఓ మైనర్ బాలిక పోలీసులను ఆశ్రయించింది. అతడి వేధింపులు తట్టుకోలేక పోలీసు స్టేషన్ తలుపు తట్టింది. తండ్రి వయసున్న కీచకుడి నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గతంలోనూ బాలికలపై వేధింపులకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలోని హైనీ స్కూల్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సూర్యదేవర కన్న జాషువా(50)పై శుక్రవారం ఓ బాలిక ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోవాలని ప్రతిరోజూ ఇంటికి వచ్చి వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పదవ తరగతి ఫెయిల్ కావడంతో బేకరీలో పనిచేస్తూ దివ్యాంగురాలైన తల్లిని పోషించుకుంటున్నానని తెలిపింది. స్కూల్‌లో చదివేటప్పుడు కూడా లైంగికంగా జాషువా వేధించేవాడని వెల్లడించింది. తన తల్లి, బంధువులు ఎంత వారించినా వినడడం లేదని.. జాషువా నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కామాంధుడి నుంచి రక్షణ కావాలంటూ బాధిత బాలిక మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. తన చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కష్టాలు పడుతున్నామని, ఇప్పుడీ కామాంధుడి వేధింపులతో మరింత క్షోభ అనుభవిస్తున్నామని వాపోయింది.

Also Read: కామాంధుడి కథ ముగిసింది.. చెరువులోకి దూకి చచ్చిపోయాడు!

కాగా, జాషువా దురాగతాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కూల్‌లో చాలా మంది బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని తెలిసింది. గతంలో గుడివాడకు చెందిన బాలిక ఇతడి వేధింపులు తట్టుకోలేక మచిలీపట్నం హాస్టల్ లోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాషువా దురాగతాలపై విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు