వీళ్ల సంగతేంటి? : న్యాయం కావాలి – అత్యాచార బాధిత కుటుంబాలు

  • Publish Date - December 7, 2019 / 01:22 AM IST

దిశ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిందితులను ఎన్ కౌంటర్ చేసి.. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేశారని యావత్ దేశం కీర్తిస్తోంది. దీంతో అత్యాచార బాధిత కుటుంబాలు తమకు కూడా న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రేపిస్టులెవరైనా రేపిస్టులేనని వారిని ఎన్‌కౌంటర్ చేయాల్సిందేనని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. దిశ ఘటన జరిగిన రోజే వరంగల్‌లో మానస అనే యువతి హత్యాచారానికి గురైంది.

పోలీసులు నిందితుడు సాయిని పట్టుకుని విచారణ జరుపుతున్నారు. బాధిత కుటుంబాలను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పటికే కూతురును కోల్పోయిన తమకు కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అత్యాచారం జరిపింది నలుగురైతే పోలీసులు ఒక్కరే నిందితుడని చెబుతున్నారని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. దిశ నిందితులను కాల్చి చంపినట్టే.. మానస కేసులో నిందితులను కాల్చి చంపాలని డిమాండ్‌ చేస్తోంది.

కుమ్రం భీం జిల్లాలో టేకు లక్ష్మిపై అత్యాచారం చేసి హత్య చేశారు ముగ్గురు దుర్మార్గులు. 
నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్ధూమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేయకుండా ఈ ముగ్గురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
వరుస హత్యలతో రాష్ట్రాన్ని హడలెత్తించిన హాజీపూర్‌ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్ చేసి పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు కోర్టులో కేసు తేలడం లేదు. 
ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి హత్యచేసి.. శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి బావిలో పూడ్చిపెట్టాడు శ్రీనివాస్‌రెడ్డి. 
ఈ సైకోను అరెస్ట్‌ చేసి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు శిక్ష పడకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
మానస, టేకు లక్ష్మి, హాజీపూర్‌ సైకో శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 
Read More : ఆమెకు న్యాయం జరిగేదెప్పుడు? : ఉన్నావ్ దీపం ఆరిపోయింది