Road accident in UP : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరదాబాద్లో బస్సు-ట్రక్కు ఢీకొట్టడంతో పది మంది మరణించారు. మొరదాబాద్-ఆగ్రా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చాలామంది వరకు గాయపడగా, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.
సంభాల్ జిల్లాలోని ధనారీ పోలీసు స్టేషన్ పరిధిలోని మొరాదాబాద్- ఆగ్రా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీంతో రహదారి రక్తసిక్తంగా మారింది. పది మంది మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరుగగానే స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే.. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
ఈ ప్రమాదం పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. క్షతుగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.