Fake Lady Doctor: రోగులకు మత్తు ఇచ్చి బంగారం దోపిడీ, భర్తతో కలిసి ఆసుపత్రుల్లో చోరీలు.. హైదరాబాద్‌లో కిలేడీ డాక్టర్ గుట్టురట్టు

‘డయాజెపామ్’ ఇంజక్షన్‌తో స్పృహ కోల్పోయేలా చేసి చోరీలకు పాల్పడుతోంది. యశోద, సిటిజన్ ఆసుపత్రుల్లో చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

  • Published On : March 17, 2026 / 06:16 PM IST

Fake Lady Doctor: హైదరాబాద్‌లో కిలేడీ డాక్టర్ గుట్టురట్టైంది. రోగులకు మత్తు ఇచ్చి బంగారం దోచుకున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిలేడీ తన భర్తతో కలిసి ఆసుపత్రుల్లో దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి కిలేడీని, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

ఆమె వైద్యురాలిగా నటిస్తూ వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తోందని పోలీసులు తెలిపారు. ‘డయాజెపామ్’ ఇంజక్షన్‌తో రోగులు స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఆ తర్వాత చోరీలకు పాల్పడుతోంది. యశోద, సిటిజన్ ఆసుపత్రుల్లో ఈ తరహా చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 11న రెండు చోట్ల దొంగతనాలు అయ్యాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీన్ని సవాల్ గా తీసుకుని దర్యాఫ్తు చేపట్టారు.

ఈ క్రమంలో గౌండ్ల శిరీష, సాయి కుమార్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను నవాబ్‌పేట, వికారాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారి నుంచి 11 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే బాలెనో కారు, 2 సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. మార్కెట్, చందానగర్ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయి.