Shilpa Chowdary : కిట్టీ పార్టీల పేరుతో పలువురు సెలబ్రిటీల వద్ద కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో అరెస్టైన శిల్పా చౌదరి రెండో సారి పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. మూడు రోజులుగా పోలీసుల దర్యాప్తుకు శిల్పా చౌదరి సహకరించలేదని తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు ఆమెను ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. కస్టడీలో శిల్ప పోలీసులకు సహకరించక ముప్పతిప్పలు పెడుతోంది. దీంతో మళ్ళీ మూడో విడత కస్టడీ కూడా వేసేందుకు పోలీసులు సిధ్ధమవుతున్నారు. రేపు ఉదయం లోపల ఆమె వద్దనుంచి వీలైనంతవరకు సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా మొదట రెండు బ్యాంకు అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇప్పడు మరో 3 అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. మొత్తం 5 బ్యాంక్ అకౌంట్లతో పాటు ఒక లాకర్ను కూడా పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇప్పటికే శిల్పాచౌదరి చేసిన అప్పులకు సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు బాధితుల స్టేట్మెంట్స్ ఆధారం చేసుకుని శిల్పా ముందు పెట్టడంతో తాను నిర్దోషినంటూ పోలీసులతో వాదనకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
రోహిణికి రూ.13 కోట్లు ఇచ్చినట్టు విచారణలో శిల్పాచౌదరి చెప్పింది. కాగా ఆమె డబ్బులు ఇచ్చినట్లు సంబంధిత పత్రాలు లేకపోవటంతో పోలీసులకు సవాల్ గా మారింది. హవాలా రూపంలో రూ.90కోట్లు మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గచ్చిబౌలిలో ఆసుపత్రి నిర్మాణంలో ఒకరికి ఇచ్చిన 6 కోట్ల రూపాయల విషయంలో పోలీసుల విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది.
Also Read : Ganja Seized : గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్ : రూ. 11 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
బ్లాక్మనీని వైట్మనీగా మార్చడానికి కొంతమంది తనకు డబ్బులు ఇచ్చారని శిల్పా మొదటి సారి పోలీసు కస్టడీలో తెలిపింది. ఆవిధంగా ఎవరెవరు శిల్పాకి ఎంతెంత డబ్బు ఇచ్చారు? అనే కోణంలో వారిని కూడా విచారించేందుకు పోలీసులు రంగం సిధ్దం చేసుకుంటున్నారు. రెండో సారి కస్టడీలోకి తీసుకున్న మూడురోజులు పాటు శిల్పా ఇచ్చిన స్టేట్మెంట్లో ఎటువంటి కీలక సమాచారం లభ్యం కానందున మళ్ళీ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.