ఎంత పైశాచికత్వం : సైడ్‌ ఇవ్వమని అడిగితే.. వేలు కొరికేశాడు

  • Publish Date - February 26, 2019 / 06:40 AM IST

భయ్యా కొంచెం సైడ్ ఇవ్వు నేను వెళ్లాలి.. అని అడిగిన పాపానికి వేలు కొరికేశాడు. ఈ ఘటన హైదరాబాద్ సిటీ మౌలాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జాఫర్‌ పెయింటర్‌గా పనిచేసేవాడు. ఆదివారం (ఫిబ్రవరి 24)న జాఫర్ బైక్‌పై లాలాపేట్‌ వెళుతున్నాడు. మౌలాలి కమాన్‌ దగ్గర తన బైకుకు అడ్డంగా ఓ ఇండికా కారు వచ్చి ఆగింది. రాంగ్ రూట్ వచ్చిందే కాకుండా.. కారును అడ్డంగా ఆపటంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. జాఫర్ కారు నడిపే వ్యక్తిని.. భయ్యా కారు కొంచెం కారు పక్కకు తీస్తే నేను వెళ్లిపోతానని అడిగాడు. అంతే..తీవ్ర ఆగ్రహానికి లోనైన కారు డ్రైవర్‌ మహ్మద్‌ ఆలి.. జాఫర్ పై బూతులతో దాడికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో జాఫర్ కుడిచేతి వేలును కొరికేశాడు మహ్మద్. అదికూడా ఆషామాషీగా కొరికి వదిలేయలేదు.. వేలు (ఉంగరం వేలు) తెగి పడింది.

తెగిపడ్డ వేలుతో వెంటనే ఆస్పత్రికి వెళ్లిన జాఫర్‌.. చికిత్స చేయించుకున్నాడు. సోమవారం (ఫిబ్రవరి 25)న పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితుడు మహ్మద్‌ అలీని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. మహ్మద్‌ అలీ.. మౌలాలి షాదుల్లానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.