Rakhi Suicide : పండగపూట విషాదం.. అన్న రాఖీ కట్టించుకోలేదని ఆత్మహత్య

అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య అనుబంధాన్ని చాటే పండగ రాఖీ పూర్ణిమ. అక్క, చెల్లి.. తమ సోదరులకు రాఖీ కట్టి తమకు బలాన్నివ్వాలని కోరుకుంటారు. నేను నీకు రక్షగా ఉంటానన్న నమ్మకాన్ని

  • Published On : August 22, 2021 / 09:22 PM IST

Rakhi Suicide

Rakhi Suicide : అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య అనుబంధాన్ని చాటే పండగ రాఖీ పూర్ణిమ. అక్క, చెల్లి.. తమ సోదరులకు రాఖీ కట్టి తమకు బలాన్నివ్వాలని కోరుకుంటారు. నేను నీకు రక్షగా ఉంటానన్న నమ్మకాన్ని సోదరులు ఇస్తుంటారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్ వేడుకలు జరిగాయి.

అలాంటి రాఖీ పండుగపూట విషాదం నెలకొంది. అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగాన్ని మిగల్చాల్సిన పండుగ వారింట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ప్రేమగా అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లిన చెల్లికి అవమానం ఎదురైంది. దీంతో చెల్లెలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు వీధిలో ఆదివారం(ఆగస్టు 22,2021) చోటు చేసుకుంది.

బసన్న దంపతులకు ఇద్దరు సంతానం. మమత(22), రమేశ్. ఆదివారం రాఖీ పండగ కావడంతో అందరు చెల్లెళ్ల మాదిరే మమత కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లింది. కారణం ఏంటో కానీ, రాఖీ కట్టించుకునేందుకు రమేశ్ నిరాకరించాడు. ఎంతో ప్రేమతో రాఖీ తీసుకొచ్చిన మమత.. తన అన్నయ్య ఆ మాట అనగానే తట్టుకోలేకపోయింది. తాను తెచ్చిన రాఖీ సాక్షిగా అన్నయ్య చేతిలో అవమానం ఎదురైందని కంటతడి పెట్టింది.

ఈ ఘటన జరిగిన కాసేపటికే ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని మమత ఆత్మహత్య చేసుకుంది. అన్నయ్య రాఖీ కట్టుకోలేదన్న మనస్తాపంతోనే ఆమె ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అన్న రాఖీ కట్టుకోకపోవడమే దీనికి కారణమా? లేక మరో కారణం ఏమైనా ఉందా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.