ఒడిశాలో దారుణం జరిగింది. కర్పాబహాల్ గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడి తల్లి ప్రమాదవశాత్తూ మృతిచెందింది.
ఒడిశాలో దారుణం జరిగింది. కర్పాబహాల్ గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడి తల్లి ప్రమాదవశాత్తూ మృతిచెందింది. కానీ, ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఊరులో ఒకరు కూడా తోడు రాలేదు. తక్కువ కులానికి చెందినవారనే కారణంతో కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. తన తల్లి అంత్యక్రియలకు సహకరించమనీ మృతురాలి కుమారుడు గ్రామస్తులను ప్రాధేయపడ్డాడు. అయినా ఒక్కరి మనస్సు కూడా కరగలేదు. చివరకు చేసేదేమి లేక.. ఒక్కడే సైకిల్పై తన తల్లి మృతదేహాన్ని ఐదు కిలోమీటర్ల వరకు తీసుకెళ్లి అడవిలో ఖననం చేశాడు.
జాంకి సిన్హానియా(45), ఆమె కుమారుడు సరోజ్(17) కర్పాబహాల్ గ్రామంలో నివాసముంటున్నారు. జాంకి భర్త గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తోంది. మంచి నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్లిన సరోజ్ తల్లి అదుపు తప్పి బావిలో పడి మృతి చెందింది. తన తల్లి అంత్యక్రియలకు సహకరించమని గ్రామస్తులను వేడుకున్నప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని సరోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తక్కువ కులానికి చెందిన వాళ్లమని గ్రామస్తులంతా తమను దూరం పెట్టారని వాపోయాడు.