ముచ్చుమర్రిలో దారుణం.. భారీగా పోలీసుల మొహరింపు.. అసలేం జరిగింది?

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ఎల్లాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.

tension at Muchumarri village in Nandyal district after girl death

Nandyal district: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ఎల్లాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికను ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి చంపేసిన దారుణ ఘటన వెలుగు చూడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అత్యాచారం అనంతరం హత్య చేసి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో బాలికను పడేశారు. బాలిక మృతదేహం కోసం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో స్థానికుల సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరానికి పాల్పడినట్టు నిందితులు ఒప్పుకునట్లు సమాచారం.

ఆదివారం పార్కులో ఆడుకోవడానికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు కొత్త ఎల్లాల గ్రామానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ తో అనుమానాస్పద ప్రాంతాల్లో గాలించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పంప్ హౌస్ ప్రాంతంలో జాగిలం తిరగడంతో అక్కడే ఏదో జరిగిందని పోలీసులు అనుమానించారు. బాలిక పార్కులో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టడంతో ఈ దారుణం బయటపడింది.

Also Read : అల్లుడిని చంపించిన అత్త.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు

చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల వయసు 14 నుంచి 16 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు. బాలిక హత్య నేపథ్యంలో కొత్త ఎల్లాల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలు, 20 మందికిపైగా పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ముక్కపచ్చలారని బాలికపై ఘాతుకానికి పాల్పడడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read : ఛీ..ఛీ.. స్కూల్‌లో ప్రిన్సిపల్ పాడు పని, మహిళా టీచర్‌తో అలా..

ఎంపీ బైరెడ్డి శబరి సొంత గ్రామంలో ఘటన
బాలిక కోసం గాలింపు జరుపుతున్న ప్రదేశానికి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేరుకున్నారు. తమ సొంత గ్రామంలో ఈ ఘటన జరగడంతో వీరిద్దరూ హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేస్తామని హామీయిచ్చారు.

కుందుర్పిలో విషాదం
అనంతపురం జిల్లా కుందుర్పిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పాఠశాల విద్యార్థులు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కుందుర్పి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 6వ తరగతి విద్యార్థి విష్ణువర్ధన్ బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన నవీన్ అనే మరో విద్యార్థి నీటిలో మునిగిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుందుర్పిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు