Prakasam District : ప్రకాశం జిల్లాలో రూ.3 కోట్లు దారి దోపిడీ ?

ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు దారికాచి 3 కోట్ల రూపాయలు దోచుకెళ్లారనే వార్త సంచలనంగా మారింది.

Prakasam District :  ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు దారికాచి 3 కోట్ల రూపాయలు దోచుకెళ్లారనే వార్త సంచలనంగా మారింది. గుజరాత్ కు చెందిన కాలురామ్, అరవింద్ లు కొలకతా నుండి కర్ణాటకలోని హోస్ పేటకు కారులో వెళుతుండగా సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకాశం జిల్లా డోర్నాల మండలం యడవల్లి అటవీ ప్రాంతంలోకి రాగానే,  వెనక నుంచి కారులో వచ్చిన దుండగలు వారి కారును అటకాయించారు.

వారికి కత్తి చూపించి బాధితుల కారులో ఎక్కి అక్కడి నుంచి పక్కనే ఉన్న బలిజేపల్లి రహదారిలోకి కారును మళ్లించారు. అక్కడ వారి వద్ద ఉన్న రూ. 3 కోట్ల నగదు దోచుకు వెళ్లారు. వెళ్లేటప్పుడు కారు తాళాలు పక్కనే ఉన్న చెట్లలోకి విసిరేసి వారు వచ్చిన కారులో పరారయ్యారు.  దీంతో బాధితులు కారును అక్కడే వదిలేసి కాలి నడకన కర్నూలు-గుంటూరు రహదారిపై నడుచుకుంటూ వెళుతున్నారు.

ఈక్రమంలో వీరిని చూసిన అటవీశాఖ సిబ్బంది విచారించారు. అటవీశాఖ సిబ్బంది సహాయంతో మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసి ఘటనా స్ధలానికి చేరుకున్నారు బాధితులు.  మార్కాపురం ఏఎస్పీ, ముగ్గరు ఎస్సైలు,ఒక సీ.ఐ క్లూస్ టీంతో కలిసి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఘటనాస్ధలంలో డాగ్ స్క్వాడ్స్ ను రంగంలోకి దింపినా ఆధారాలు లభ్యం కాలేదు. దుండగులు తమను డోర్నాల నుంచి ఫాలో అయ్యారని బాధితులు చెప్పారు.

కాగా పోలీసులు విచారణ ప్రారంభించే సరికి బాధితులు సరైన సమాధానాలు చెప్పక పోవటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దుండగులు దోచుకు వెళ్శింది లక్ష అని ఒకసారి, మూడులక్షలు అని మరోసారి, 5 కోట్ల రూపాయలు అని ఇంకోసారి చెప్పటంతో పోలీసులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. దోపిడీకి గురైన నగదుకు సరైనా ఆధారాలు చూపించక పోవటం, ఎవరి డబ్బు… ఎక్కడికి తీసుకువెళుతున్నారు… అనే దానికి సరైన సమాచారం ఇవ్వకపోవటంతో బాధితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు