Domestic violence : భర్త రెండో పెళ్లికి .యత్నాలు…బలవన్మరణానికి పాల్పడిన భార్య

నాలుగేళ్ల కాపురంలో బంగారం లాంటి ఇద్దరు మగపిల్లలతో ఆనందంగా గడపాల్సిన జీవితం నరకప్రాయంగా మారింది. రెండు పదుల వయస్సులోనే జీవితాన్ని ముగించింది ఓ ఇల్లాలు.

Woman end her life due to domestic violence : పెళ్లైన నాలుగేళ్లకో భార్య పై మోజు తీరిపోయిందో భర్త కి. అనుకున్నదే తడువుగా రెండో పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. భార్యను విడాకులు కోరాడు. అందుకు అత్తమామలు వంత పాడారు. నాలుగేళ్ల కాపురంలో బంగారం లాంటి ఇద్దరు మగపిల్లలతో ఆనందంగా గడపాల్సిన జీవితం నరకప్రాయంగా మారింది. రెండు పదుల వయస్సులోనే జీవితాన్ని ముగించింది ఓ ఇల్లాలు.

విజయనగరం జిల్లా భగోపురం మండలం రావివలస గ్రామానికి చెందిన వెంపాల రాములబంగారికి(అలియాస్ శ్యామ్) దల్లిపేట గ్రామానికి చెందిన రమాదేవితో(21) నాలుగేళ్ల క్రితం వివాహమయ్యింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి కౌశిక (3), వాయిత్‌ (9 నెలలు) ఇద్దరు పిల్లలున్నారు.

పెళ్లి అయిన రెండేళ్ల తరువాత వీరి కుటుంబంలో చిన్నచిన్న గొడవలు మొదలయ్యాయి. భర్తతోపాటు అత్త,మామలు తరచూ రమాదేవిని వేధించడం మొదలుపెట్టారు. తన కుమారుడికి రెండో వివాహం చేస్తామని… అత్త అప్పల నరసమ్మ, మామ రమణ కలిసి , తన కుమారుడికి విడాకులు ఇవ్వాలని… కాగితంపై సంతకం పెట్టమని 15 రోజుల క్రితం రమాదేవిపై ఒత్తిడి తెచ్చారు.

దీంతో మనస్తాపానికి గురైన రమాదేవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, వారి బంధువులు కలిసి గ్రామ పెద్దల దగ్గర పంచాయతీ నిర్వహించి వారిద్దరికీ సర్దిచెప్పి పంపించారు. ఈక్రమంలో మళ్లీ సోమవారం అత్తమామలతో పాటు భర్త కూడా విడాకులు ఇవ్వాలని రమాదేవిని వేధించడం మొదలుపెట్టాడు.

దీంతో జీవితంపై విరక్తి చెందిన రమాదేవి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అందరితో కలుపుగోలుగా ఉండే ఈమె చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి దల్లి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు