కర్నూలు జిల్లాలో టిక్టాక్ మోజులో ఓ మహిళ ఫ్యామిలీని వదిలేసింది.
ఫ్రెండ్ షిప్ అంటూ కలిశారు. టిక్టాక్లో మెరిశారు. ఒకరికొకరు లైక్లు కొట్టుకున్నారు. చిన్నగా ఫ్రెండ్షిప్ డైలాగులతో మొదలుపెట్టి… డ్యూయట్లతో టిక్టాక్లో దూకుడు పెంచారు. ఫుల్గా లవ్ ట్రాక్లతో రెచ్చిపోయారు. స్నేహం అంటూ అంతకుమించి అతుక్కుపోయారు. ఒకరినొకరు విడిచిపెట్టలేనంతగా కలిసిపోయారు. ఇంతకీ… ఈ తతంగమంతా ఓ అమ్మాయి, అబ్బాయి నడిపుంటార్లే అని అనుకుంటున్నారా…? అలా అనుకుంటే మీరు టిక్టాక్లో కాలేసినట్లే. ఈ వ్యవహారంతా నడిపింది ఇద్దరు మహిళలు.
కర్నూలు జిల్లా ఆదోని కిలిచినపేటకు చెందిన అర్చనకు కర్ణాటక రాష్ట్రం కొప్పళకు చెందిన రవి అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ సంతానం. సంసారం హాయిగా సాగుతోంది. అర్చన సోదరి లక్ష్మిని బెంగళూరుకు చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు. అతను అక్కడ పెట్రోలు బంక్లో పనిచేస్తున్నారు. అదే బంకులో పనిచేస్తున్న యువతి అంజలికి లక్ష్మితో స్నేహం ఏర్పడింది. లక్ష్మీ అక్కడితో ఆగకుండా అక్క అర్చనకు అంజలికి పరిచయం చేసుకుంది. ఆ పరిచయం టిక్ టాక్లో వీడియోల దాకా సాగింది. అంతకుమించి ముందుకెళ్లింది. వింత రిలేషన్ అంటూ పక్కవాళ్లు వెక్కిరించేదాకా వెళ్లింది.
సంవత్సరకాలంలో అర్చన, అంజలి మధ్య బాగా సాన్నిహిత్యం పెరిగింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా పరిస్థితి తయారైంది. ఇక వీరిద్దరి సాన్నిహిత్యం ఏ రేంజ్లో ఉందన్నది… టిక్టాక్ వీడియోలు చూస్తే అర్ధమవుతుంది. బెంగళూరు యువతి అంజలి మగరాయుడిగా.. అర్చన ప్రేయసిగా టిక్టాక్లో పలు వీడియోలు చేశారు. వింత వింత డైలాగులకు టిక్టాక్లు చేస్తూ విచిత్రమైన వీడియోలు టిక్టాక్లో పోస్ట్ చేశారు.
ఇక కొన్నిరోజుల క్రితం భర్తతో గొడవ పడ్డ అర్చన పుట్టింటికి వచ్చింది. అయితే… ఈ నెల 10న ఇంట్లో చెప్పకుండా పిల్లల్ని వెంటబెట్టుకుని ఆమె అంజలి దగ్గరకు వెళ్లిపోయింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భర్త, తల్లిదండ్రులు, బంధువులు తెలిసిన చోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు.
కుమార్తె, మనవళ్ల అదృశ్యంపై ఆదోని పోలీస్ స్టేషన్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తుకు షాక్కు గురయ్యారు. కాగా, బెంగళూరులో వివాహితను గుర్తించారు. వెంటనే ఆదోనికి తీసుకొచ్చారు. పోలీసులు టిక్టాక్ను పరిశీలించగా ఇద్దరు యువతులు చాలా చాలా సన్నిహితంగా ఉంటున్నట్లు గుర్తించారు.