Madhapur Road Accident : మాదాపూర్ సీఐఐ చౌరస్తావద్ద నిన్నజరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరెడ్ మెట్ లో నివాసం ఉండే టి.అజయ్(23) మాదాపుర్ లోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. లాలాపేటలో నివాసం ఉండే అతని స్నేహితురాలు జెన్నిఫర్ మరియ డిక్రూజ్(23) కొత్తగూడలోని ఏజీఎస్ హెల్త్ సంస్ధలో క్వాలిటీ అస్యూరెన్స్ అనలిస్ట్ గా పని చేస్తోంది.
ఆదివారం ఉదయం ఇద్దరూ కలిసి బుల్లెట్ బైక్ మీద కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వైపు వస్తున్నారు. సీఐఐ చౌరస్తా దగ్గర సిగ్నల్స్ పడటంతో బైక్ ఆపారు. ఇంతలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న వీరి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. స్ధానికులు వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Also Read : Man Looted Cash : స్నేహితుడని ఇంట్లో ఉండమంటే… దోచుకెళ్లాడు
కిందపడటంతో జెన్నిఫర్ తలకు తీవ్ర గాయమై అప్పటికే మరణించిందని ఆస్పత్రిలో వైద్యులు తెలిపారు. కాగా అజయ్ ఎడమ చేయి, ఎడమ కాలు, వెన్నెముకకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన కారు నడుపుతున్న సృజన్ కుమార్ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు.
కారు నెంబరు ఆధారంగా పోలీసులు కారును నడిపిన సృజన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. నిందితుడు శనివారం రాత్రి కొండాపూర్లో జరిగిన ఓ పార్టీలో అతిగా మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా అజయ్, జెన్నీఫర్లకు ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే ఆ కుటుంబాల్లో ఈ రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఓ కుటుంబానికి కడుపుకోత మిగల్చగా…. మరో కుటుంబానికి కొడుకు ఎప్పటికి కోలుకుంటాడో తెలియని అగమ్య గోచరస్ధితిలోకి నెట్టేసింది.