Nalgonda : కాబోయే భర్త వేధింపులతో యువతి ఆత్మహత్య
పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వేధింపులు భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లగొండజిల్లాలో చోటు చేసుకుంది.
- chvmurthy
- Published On : May 17, 2022 / 11:08 AM IST
Nalgonda
Nalgonda : పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వేధింపులు భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లగొండజిల్లాలో చోటు చేసుకుంది. అనుముల మండలం పంగవానికుంట గ్రామానికి చెందిన మేగావత్ వెంకటేశ్వర్లు కుమార్తె నవత (22), త్రిపురారం మండలంలోని లక్పతి తండాకు చెందిన ధనావత్ జగపతిబాబు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన ఇరు కుటుంబాలు అంగీకరించి ఇటీవల నిశ్చితార్థం జరిపించాయి.
కట్నం కింద వరుడికి రూ.20 లక్షల విలువైన ప్లాటుతో పాటు రూ.80 వేల నగదు ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తనకు కట్నం కింద తనకు ప్లాటు వద్దని.. దాన్ని అమ్మి డబ్బులివ్వాలని జగపతిబాబు ఆదివారం రాత్రి నవతకు ఫోన్ చేసి తిట్టాడు. పైసలు ఇవ్వలేక పోతే చావు అని మెసేజ్లు పెట్టి వేధించాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవత.. సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Madras High Court : దేశ చరిత్రలోనే తొలిసారి-వాట్సప్ ద్వారా కేసు విచారించిన న్యాయమూర్తి
