Karnataka Board Exams : కర్ణాటక హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటక స్టేట్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ బోర్డ్ (KSEAB) 5వ తరగతి, 8వ తరగతి, 9 తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ బోర్డు పరీక్షలు గతంలో మార్చి 13న ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పుడు మార్చి 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SSLC) పరీక్షలు కూడా మార్చి 25 నుంచే ప్రారంభం కానున్నాయి.
షెడ్యూల్ ప్రకారం.. 5వ తరగతికి సంబంధించిన బోర్డు పరీక్షలు మార్చి 25, మార్చి 26 తేదీల్లో జరుగుతాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేపర్ మార్చి 25న మధ్యాహ్నం 2.30 నుంచి4.30 గంటల వరకు, ఆ తర్వాత మార్చి 26న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు గణితం పరీక్ష జరగనుంది. 8వ తరగతి పరీక్షలు మార్చి 25 నుంచి మార్చి 28 వరకు నిర్వహించనున్నారు.
థర్డ్ లాంగ్వేజీ పరీక్ష మార్చి 25న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మార్చి 26న ఉదయం 10 నుంచి 12.30 వరకు గణితం పరీక్ష, మార్చి 27న మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు సైన్స్ పరీక్ష, మార్చి 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సోషల్ సైన్స్ పరీక్షను నిర్వహించనున్నారు.
9వ తరగతికి మార్చి 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు థర్డ్ లాంగ్వేజ్ పరీక్ష, మార్చి 26న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు గణితం, మార్చి 27న మధ్యాహ్నం 2 నుంచి 5.15 వరకు సైన్స్ పరీక్ష, మార్చి 28న ఉదయం 10 నుంచి 1.15 గంటల వరకు సోషల్ సైన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎస్ఎస్ఎల్సీ (SSLC) పరీక్షలతో గందరగోళం ఏర్పడకుండా ఉండేందుకు 5, 8, 9 తరగతులకు పరీక్షలు మార్చి 25, మార్చి 27 తేదీలలో మధ్యాహ్నం జరుగుతాయి.