BJP Suspends 5 Rebel Leaders In Himachal, Including State Vice Chief
BJP Suspends: సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో భారీ కుదుపు ఏర్పడింది. టికెట్లు ఆశించి భంగపడ్డ రెబల్స్కు పార్టీ షాక్ ఇచ్చింది. మొత్తం ఐదుగురు నేతల్ని పార్టీ నుంచి తొలగించారు. ఇందులో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కూడా ఉండడం గమనార్హం. వేటు పడ్డ వారిలో మాజీ ఎమ్మెల్యేలు తేజ్వాంత్ సింగ్ నేగి (కిన్నౌర్), కిషోరి లాల్ (అన్ని), మనోహర్ దిమాన్ (ఇండోర), కే ఎల్ ఠాకూర్ (నలగఢ్)లు ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర బీజేపీ యూనిట్ ఉపాధ్యక్షుడు క్రిపాల్ పర్మార్ కూడా ఉన్నారు.
పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వీరు.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. వారి సిట్టింగ్ స్థానాల నుంచే పోటీకి సిద్ధమయ్యారు. పర్మార్ ఫతేపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే సస్పెన్షన్ విషయమై సోమవారం బీజేపీ స్పందిస్తూ ‘‘పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన ఐదుగురు నేతల్ని పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సురేష్ కష్యప్ సస్పెండ్ చేశారు. ఆరేళ్ల పాటు వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. దీంతో వారు ఆరేళ్ల పాటు బీజేపీ తరపున ఎన్నికల్లో దిగేందుకు అర్హత కోల్పోయారు’’ అని పేర్కొన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ అనేక మంది బీజేపీ నేతలు స్వతంత్రులుగా పోటీకి దిగుతున్నారు. వీరి సంఖ్య ఇప్పటికే డజనుకు పైగానే ఉన్నట్లు సమాచారం. కాగా, నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.