Bengal Panchayat Polls: బ్యాలెట్ ఎన్నికల్లో బుల్లెట్ మోతలు.. అంతకంతకూ పెరుగుతున్న బెంగాల్ పంచాయతీ ఎన్నికల మృతులు
ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ, సీపీఎం మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. కూచ్ బెహార్ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఘర్షణల్లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘర్షణలపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆందోలన వ్యక్తం చేశారు.
- tony bekkal
- Published On : July 8, 2023 / 02:27 PM IST
West Bengal: కొద్ది సంవత్సరాల క్రితం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. బుల్లెట్ కంటే బ్యాలెట్ చాలా బలమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బహుశా బెంగాల్ రాష్ట్రానికి ఇది మరోలా వర్తిస్తుందేమో. ఎందుకంటే అక్కడ ఎన్నికలనగానే బ్యాలెట్ కంటే ముందు బుల్లెట్లే కనిపిస్తాయి. తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఘర్షణలే ఇందుకు చక్కని ఉదాహరణ. పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రారంభం అయిందో లేదో.. రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోతోంది.
శనివారం పోలింగ్ జరుగుతోంది. అయితే పోలింగ్ ప్రారంభానికి ముందే రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. బ్యాలెట్ బాక్సులో నాలుగు ఓట్లు కూడా పడకముందే నలుగురు టీఎంసీ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. కాగా, ఈ రోజు చెలరేగిన అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు (మధ్యాహ్నం 2గంటల వరకు) ఎనిమిది మంది చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అనధికారికంగా మరింత ఎక్కువ మంది చనిపోయి ఉండవచ్చు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో విపక్ష భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వివిధ ప్రాంతాల్లో కుమ్ములాడుతున్నాయి.
Indian Army adds new weapons : తూర్పు లడఖ్ ప్రాంతంలో ఆర్మీ కొత్త యుద్ద ట్యాంకుల మోహరింపు
ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ, సీపీఎం మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. కూచ్ బెహార్ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఘర్షణల్లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘర్షణలపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆందోలన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఈ వాతావరణం మహా ఘోరమైందని, ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరగాలే కానీ, బుల్లెట్ ద్వారా కాదని అన్నారు. ఈ ఘర్షణలను తాను ఖండిస్తున్నానని ఆనంద బోస్ అన్నారు.
రాష్ట్రంలో చాలా రోజుల నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి. 22 జిల్లా కౌన్సిళ్లు, 9,730 బ్లాక్ కౌన్సిళ్లు, 63,229 గ్రామాల్లో జరుగుతున్న పోలింగులో 5.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. జులై 11వతేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
