Assembly Eelections 2023: ఛత్తీస్గఢ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? సర్వేలో ఆసక్తికమైన సమాధానం
ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశలో బస్తర్ డివిజన్లోని 12 అసెంబ్లీ స్థానాలకు, దుర్గ్ డివిజన్లోని 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
- tony bekkal
- Published On : October 10, 2023 / 06:19 PM IST
Chhattisgarh Assembly Polls: తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో పదవీకాలం ముగింపు దశకు వచ్చింది. డిసెంబర్ 3 తర్వాత ఈ ఐదు రాష్ట్రల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల సర్వేలు ఊపందుకున్నాయి. ఇప్పటికే చాలా రోజులుగా సర్వేలు కొనసాగుతుండగా.. ఎన్నికల తేదీ ప్రకటనతో మరింత జోరు మీదున్నాయి.
ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై ఏబీపీ-సీఓటర్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో చాలా ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్నే మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ఛత్తీస్గఢ్ ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి. వాస్తవానికి రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమవుతూనే ఉంది. దాదాపుగా అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఈ లెక్కన చూస్తే ఐదేళ్ల పదవీ కాలంలో ఛత్తీస్గఢ్ ప్రజలను బాఘెల్ తన పనితో సంతోషపెట్టగలిగారని స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: Amartya Sen Death News: నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ మరణించారా? వాస్తవం ఏంటంటే?
అయితే ఆయన పని పట్ల ప్రజల్లో ఎంత సంతృప్తి ఉందో డిసెంబర్లో జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాల ద్వారా తెలుస్తుంది. ఒపీనియన్ పోల్లో భూపేష్ బఘేల్ సహా మాజీ సీఎం రమణ్ సింగ్, టీఎస్ సింగ్ డియో, సరోజ్ పాండే, ఇతరులను ప్రజల ముందు ఉంచి సీఎం ఎవరన్న ప్రశ్న అడిగారు. వారిలో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇందులో సీఎం బఘెల్కు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.
రాష్ట్రంలోని 45 శాతం మంది ప్రజలు ఆయన్ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని కోరుతుండగా, 26 శాతం మంది మాత్రమే మాజీ సీఎం, బీజేపీ నేత రమణ్ సింగ్కు మద్దతుగా నిలిచారు. ఆరు శాతం మంది డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్దేవ్కు, రెండు శాతం మంది బీజేపీ రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండేకు మద్దతు ఇచ్చారు. కాగా సర్వేలో పాల్గొన్న వారిలో 21 శాతం మంది సీఎం పదవికి ఈ నలుగురు కాకుండా మరొకరైతే బాగుంటుందని అన్నారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar: ఛత్రపతి శివాజీ, అంబేద్కర్లను గుర్తు చేసుకుంటూ తన 100 రోజుల పాలన గురించి బహిరంగ లేఖ రాసిన అజిత్ పవార్
తదుపరి సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారు?
– భూపేష్ బఘేల్ – 45 శాతం
– రమణ్ సింగ్ – 26 శాతం
– టీఎస్ సింగ్దేవ్ – 6 శాతం
– సరోజ్ పాండే – 2 శాతం
– ఇతరులు – 21 శాతం
ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశలో బస్తర్ డివిజన్లోని 12 అసెంబ్లీ స్థానాలకు, దుర్గ్ డివిజన్లోని 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బస్తర్ డివిజన్లోని సుక్మా, దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్, కంకేర్ నక్సల్ ప్రభావిత ప్రాంతాలనే విషయం తెలిసిందే.
