AIIMS డాక్టర్ భార్యకు కరోనా పాజిటివ్.. ఆ మరుసటి రోజే పండంటి బాబుకు జన్మనిచ్చింది!

  • Publish Date - April 4, 2020 / 04:16 AM IST

దేశంలో కరోనా రక్కసి కోరలు సాచింది.. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. 24 గంటల పాటు కరోనా బాధితుల కోసమే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎయిమ్స్ (AIIMS)లో పనిచేసే డాక్టర్ దంపతులకు ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

అప్పటికే ఎయిమ్స్ వైద్యుని భార్య నిండు గర్భిణి. ఆమెకు కూడా కరోనా సోకింది. 9నెలల కొవిడ్-19 గర్భిణికి ఎయిమ్స్ వైద్యులు అతికష్టం మీద డెలివరీ చేశారు. శుక్రవారం ఆస్పత్రిలో ఆమె ప్రసవించింది. తనకు వైరస్ సోకినప్పటికీ ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు వైరస్ సోకలేదు.. ఆరోగ్యంగానే ఉంది. ఢిల్లీలో కొవిడ్-19 బాధిత తల్లికి పుట్టిన మొట్టమొదటి బేబీ కూడా ఇదే. 

వైరస్ బాధితురాలి భర్త ఎయిమ్స్‌లో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైకాలజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పని చేస్తున్నారు. గురువారమే వీరిద్దరూ కరోనా టెస్టింగ్ చేయించుకున్నారు. వీరిద్దిరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మరుసటి రోజున డాక్టర్ సోదరుడికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అదే రోజున ఐసోలేషన్ వార్డులో 29ఏళ్ల గర్భిణి చేరింది. ఆ తర్వాత ఆమెకు పురిటి నొప్పులు రావటంతో 10 వైద్యుల బృందం కలిసి ఐసోలేషన్ వార్డును ఆపరేషన్ థియేటర్ గా మార్చేసి సి-సెక్షన్ ద్వారా డెలివరీ చేశారు. ఢిల్లీలో కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన మొదటి గర్భిణి కూడా.. వారానికి ముందే డెలివరీ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ‘తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. వారం ముందుగానే బేబీ పుట్టేసింది. సి-సెక్షన్ ద్వారా డెలివరీ చేశారు. 

ప్రస్తుతానికి పుట్టిన శిశువును తల్లి పక్కనే ఉంచారు. అవసరమైనప్పుడు తల్లి పాలు ఇచ్చేందుకు అక్కడే ఉంచారు. తల్లీపాల ద్వారా బిడ్డకు వైరస్ సోకుతుంది అనడానికి కచ్చితమైన ఆధారాలు ఇప్పటివరకూ లేవు. తల్లీకి కరోనా వైరస్ ఉండటంతో పుట్టిన బిడ్డకు కూడా వైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు బ్లడ్ శాంపిల్స్ టెస్టు చేయాల్సి ఉందని ఎయిమ్స్ సీనియర్ వైద్యులు ఒకరు వెల్లడించారు. నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగానే ఈ కేసును ఎలా డీల్ చేయాలి అనేదానిపై దేశీయ టాప్ మెడికల్ ఇన్సిస్ట్యూట్ ఓ ప్రోటోకాల్ ప్రీపేర్ చేసింది. గర్భిణి పేషెంట్ల జాగ్రత్త కోసం 38 పేజీల డాక్యుమెంట్ ను వైద్య సంస్థ సిద్ధం చేసింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కొవిడ్-19 వ్యాధి సోకిన తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలనకుంటే ఇవ్వొచ్చునని తెలిపింది. కానీ, కొన్ని అవసరమైన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సూచించింది. శిశువుకు పాలిచ్చే సమయంలో తల్లి తప్పకుండా శ్వాసపరమైన పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని, తప్పని సరిగా నోటికి మాస్క్ ధరించాల్సిందిగా జాగ్రత్తలు చెప్పింది. శిశువును తాకే ముందు తన చేతులను తల్లి తప్పగా కడుక్కోవాలి. అంతేకాదు.. ఆమె తాకిన ప్రదేశాలను ఎప్పటికప్పుడూ క్లీన్ చేస్తుండాలి. (కరోనాతో పోరాడే వైద్యుల కోసం.. స్పెషల్ ‘బయో సూట్’ రెడీ చేస్తోంది DRDO)