Bournvita Health Drinks Category : బోర్న్విటాలో అధిక చక్కెర కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) కూడా బోర్న్విటాలో షుగర్ అధిక మోతాదులో ఉందని నిర్ధారించింది. అయితే, తాజాగా కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బోర్న్విటాను ‘హెల్త్ డ్రింక్’ కేటగిరీ నుంచి బ్రాండ్, అన్ని ఇతర డ్రింక్స్ను తొలగించాలని ఇ-కామర్స్ కంపెనీలను కోరింది.
‘హెల్త్ డ్రింక్’ అనే పదాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (FSS) చట్టం 2006 లేదా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సమర్పించిన నిబంధనల ప్రకారం.. సరైనదిగా నిర్వచించలేదని కేంద్ర మంత్రిత్వ శాఖ అడ్వైజరీలో పేర్కొంది. అందుకే.. బోర్న్విటా అనేది అసలు హెల్త్ డ్రింక్ కేటగిరీలోకే రాదని, వెంటనే ఈ హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి తొలగించాల్సిందిగా కేంద్రం ఆదేశాల్లో పేర్కొంది.
అధిక స్థాయిలో షుగర్ లెవల్స్ ఉన్నట్టు నిర్ధారణ :
బోర్న్ విటాలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్సీపీసీఆర్ రంగంలోకి దిగింది. సీఆర్పీసీ చట్టం 2005లోని సెక్షన్ 14 కింద విచారణ జరిపింది. ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006, మోడల్జ్ ఇండియా ఫుడ్ (Mondelez India Food) ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమాలు, నిబంధనల్లో హెల్త్ కేటగిరీ డ్రింక్స్ సరిగా నిర్వచించలేదని మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 10 నాటి నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మోడల్జ్ కంపెనీ బోర్న్ విటా, క్యాడ్ బెర్రీ వంటి అనేక ఇతర పెద్ద బ్రాండ్లను కూడా కలిగి ఉంది. ప్రత్యేకించి బోర్న్విటాలో షుగర్ లెవల్స్ అధిక స్థాయిలో ఉన్నాయని తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంది.
ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాలి :
అంతకుముందు, భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన పవర్ సప్లిమెంట్లను ‘హెల్త్ డ్రింక్స్’గా అంచనా వేస్తున్న కంపెనీలపై చర్య తీసుకోవాలని ఎన్సీపీసీఆర్ భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI)ని కోరింది. రెగ్యులేటరీ బాడీ ప్రకారం.. దేశంలోని ఆహార చట్టాలలో ‘హెల్త్ డ్రింక్’ నిర్వచనం లేదు. దాని ప్రకారం.. ఏదైనా ప్రొడక్టును హెల్త్ డ్రింక్గా ప్రొజెక్ట్ చేయడం నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నెల ప్రారంభంలో, డైరీ ఆధారిత లేదా మాల్ట్ ఆధారిత డ్రింక్స్ను కూడా ‘హెల్త్ డ్రింక్స్’గా లేబుల్ చేసి అమ్మోద్దంటూ ఈ-కామర్స్ పోర్టల్లను ఆదేశించింది.
యూట్యూబర్ విమర్శలతో మొదలైన వివాదం :
గతంలో బోర్న్విటా అనారోగ్యకరమైనదిగా పేర్కొంటూ ఒక యూట్యూబర్ తన వీడియోలో విమర్శించారు. దీని పౌడర్ సప్లిమెంట్లో అధిక చక్కెర, కోకో ఘనపదార్థాలు, హానికరమైన రంగులు ఉన్నాయని ఆరోపించడంతో అప్పట్లో వివాదం తలెత్తింది. పిల్లలలో క్యాన్సర్తో సహా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని ఆరోపించాడు. ఈ క్రమంలోనే ఎన్సీపీసీఆర్ రంగంలోకి విచారణ చేపట్టడంతో అది నిజమేనని తేలింది.
Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!