క్యాన్సర్తో బాధపడుతున్న బాలిక కోరికను రాచకొండ పోలీసులు నెరవేర్చారు. ఆమెను ఒక్క రోజు పోలీస్ కమిషనర్ ను చేశారు.
క్యాన్సర్తో బాధపడుతున్న బాలిక కోరికను రాచకొండ పోలీసులు నెరవేర్చారు. ఆమెను ఒక్క రోజు పోలీస్ కమిషనర్ ను చేశారు. హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్కు చెందిన నర్సింహ, పద్మ దంపతుల కుమార్తె రమ్య (17) ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా ఆమె బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతోంది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఒక్క రోజు పోలీస్ కమిషనర్ కావాలని ఆమె కోరుకుంది.
ఆమె కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రమ్య కోరిక నెరవేర్చేందుకు సీపీ ముందుకొచ్చారు. మంగళవారం (అక్టోబర్ 29, 2019) ఆమె ఫుల్ యూనిఫాంలో కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె పోలీసులకు శాంతిభద్రతలపై సూచనలు చేశారు. పోలీసులకు 5 Sలతో కూడిన సలహా ఇచ్చారు. రమ్య త్వరగా కోలుకోవాలని పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆకాంక్షించారు. వైద్యం కోసం కొంత నగదును ఆమె తల్లిదండ్రులకు ఆయన అందజేశారు.