మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్

  • Publish Date - May 6, 2019 / 01:02 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పోలింగ్ ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా  పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల ఓటర్లు ఎండలో ఇబ్బందులు ఎదుర్కోన్నారు.    ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 80 శాతం పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. తొలివిడతలో భాగంగా 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10న రెండో విడత, 14న మూడవ విడత ఎన్నికలు జరుగుతాయి.మే 27న ఓట్లు లెక్కించి ఫలితాలు వెలువడతాయి. కాగా…..ఈ పోలింగ్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకోక పోవటం. ఆయన ఫెడరల్  ప్రంట్ విషయమై చర్చించేందుకు సోమవారం కేరళ బయలు దేరి వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తో ఆయన సోమవారం రాత్రి సమావేశం అవుతారు.