Telangana Budget 2019-20 : విపక్షాల పెదవి విరుపు

  • Publish Date - February 22, 2019 / 02:32 PM IST

ప్రజలను మభ్యపెట్టేందుకే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం చాలా ఆందోళనకర పరిస్ధితుల్లో ఉందన్నారు. 

బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక మంత్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు బీజేపీ నేత లక్ష్మణ్‌. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్‌ కేటాయింపులకు ఎక్కడా పొంతన లేదన్నారు. ప్రభుత్వం ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు లక్ష్మణ్‌. 

బడ్జెట్ కేటాయింపులకు.. రాష్ట్ర అవసరాలకు విపరీతమైన వ్యత్యాసం ఉందన్నారు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌. కేసీఆర్‌ ఆశించిన విధంగా అభివృద్ధి చేసేందుకు ప్రస్తుత బడ్జెట్‌ సరిపోదన్నారు. బడ్జెట్‌లో నిరుద్యోగ సమస్యపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. 32 వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటును ఎలా పూడుస్తారో కూడా బడ్జెట్‌లో చెప్పలేదన్నారు. 

బడ్జెట్‌ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం చేశారన్నారు బీసీ నేత ఆర్‌ కృష్ణయ్య. రెసిడెన్షియల్ స్కూల్‌లకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు బీసీలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని డిమాండ్‌ చేశారు. 

అన్నిరంగాల వారిని నిరాశపరిచేవిధంగా బడ్జెట్‌ ఉందన్నారు టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వానికి ఉన్న అప్పుల వివరాలు కూడా వెల్లడించాలని రావుల డిమాండ్‌ చేశారు.