ట్రాఫిక్ ఉండదు: ఫ్లై ఓవర్లు సిద్ధమైపోతున్నాయ్
- Subhan Ali Shaik
- Published On : May 14, 2019 / 08:26 AM IST
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్.. నగరంలో ప్లై ఓవర్ నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనుంది. స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా నగరవ్యాప్తంగా అనేక ఫ్లై ఓవర్ నిర్మాణాకు శ్రీకారం చుట్టి ఏడాది దాటిపోతుంది. నగరంలో భవిష్యత్ ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని 2020 నాటికల్లా ఎక్కువ సంఖ్యలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు పూర్తి కానున్నాయి.
ఈ క్రమంలోనే బైరమాల్గూడ కుడివైపు ఫ్లై ఓవర్ 2020 నాటికి పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఎల్బీ నగర్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకూ 14 ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం రూ.448కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్నాయి.
గతేడాది ఆగష్టులో ప్రారంభోత్సవం చేసిన కామినేని కుడిచేతి ఫ్లై ఓవర్ మే నెల ముగింపు నాటికల్లా పూర్తి కానుంది. విజయవాడ హైవేకు కలుస్తుండటంతో ఈ రూట్లో ట్రాఫిక్ భయానకంగా మారింది. దీంతో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా సిద్ధం కానుంది. ఈ నిర్మాణం జూబ్లీహిల్స్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చీ బౌలి వరకూ దారులను కలపనుంది. దీని బడ్జెట్ రూ.184కోట్లు.
