హైదరాబాద్ మహానగరంలో వినాయకుడి వేడుకలు వీధి వీధినా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయక చవితి రోజున ప్రతిష్టించిన గణనాథులు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. మూడవ నాటి నుంచే నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు గణేషుల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఆఖరి రోజు..సెప్టెంబర్ 12వ తేదీన నగరంలోని అన్ని గణనాధులు నిమజ్జనం అత్యంత కోలాహలంగా జరుగనుంది. ఈ క్రమంలో నగరంలో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులను బంద్ కానున్నాయి.
ఆఖరి రోజు వినాయక నిమజ్జనం సందర్బంగా 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్స్టేషన్ ఎస్హెచ్వోలు, అదనపు ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా..నగరంలో శాంతి భద్రతల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న ప్రజలంతా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు.