దంచికొట్టిన వాన : మంత్రి KTR సమీక్ష..అర్ధరాత్రి మేయర్ పర్యటన

  • Publish Date - September 25, 2019 / 12:55 AM IST

నగరంలో భారీ వర్షాలపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. రోడ్లు, కాలనీల్లో నిలిచిపోయిన నీటిని వీలైనంత తొందరగా క్లియర్ చేయాలని… పడిపోయిన చెట్లను తొలగించాలని ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో నగర ప్రజలకు జీహెచ్ఎంసీ అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని.. రోడ్లపైకి రాకూడదని సూచించింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాలపై అర్ధరాత్రి మంత్రి జగదీష్‌రెడ్డి విద్యుత్ శాఖా ఉన్నతాధికారులతో ఫోన్‌లో సమీక్షించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. అవసరమనుకుంటే రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించాలని అధికారులకు చెప్పారు. విద్యుత్ ప్రసారంలో కలిగే అవాంతరాలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌లకు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలంటూ మంత్రి జగదీష్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అర్ధరాత్రి నగరంలో పర్యటించారు. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అఫ్జల్‌గంజ్‌ సహా పలు ప్రాంతాల్లో తిరుగుతూ సహాయ చర్యల్ని సమీక్షించారు. నగరంలో నాలాలు మూసుకుపోవడంతోనే వరద ముప్పు పెరిగిందన్నారు 
Read More : హైదరాబాద్‌లో కుండపోత : నీట మునిగిన కాలనీలు