భగభగలు షురూ : ఇవాళా, రేపు జాగ్రత్త
- madhu
- Published On : February 25, 2019 / 01:02 AM IST
తెలంగాణ రాష్ట్రంలో భానుడు మెల్లిమెల్లిగా ప్రతాపం చూపెడుతున్నాడు. ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రానున్న 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్లున్నాయని తెలిపింది. ఫిబ్రవరి చివరి మారంలోనే ఎండలు మండుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఉదయమే సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి చిర్రుమంటున్నాడు. రెండు రోజుల పాటు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం గరిష్ట టెంపరేచర్స్ సాధారణం కంటే 6 నుండి 7 డిగ్రీల మేర పెరిగాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 39.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
జోగులాంబ గద్వాల, కరీంనగర్లో 39.3, సిద్ధిపేట, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలో 39.2, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తిలో 39 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్లో 37 డిగ్రీలు నమోదయ్యిందని వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి ఫస్ట్ వీక్లో ఎండలు 40 డిగ్రీలకు చేరుకొనే అవకాశం ఉందని, ఎండల తీవ్రత కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.
| తేదీ | 2018 | 2019 |
| ఫిబ్రవరి 21 | 32.7 | 34.6 |
| ఫిబ్రవరి 22 | 33.5 | 36.3 |
| ఫిబ్రవరి 23 | 33.5 | 36.9 |
| ఫిబ్రవరి 24 | 32.6 | 37.2 |
