కేసీఆర్ రాష్ట్రాల పర్యటన : ఫెడరల్ ఫ్రంట్ దిశగా మళ్లీ అడుగులు
- veegam team
- Published On : April 24, 2019 / 03:52 AM IST
సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్పై దృష్టి సారించారు. త్వరలోనే రాష్ట్రాల్లో పర్యటించి పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రయాణం ఖరారు కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్.. వివిధ పార్టీల అధినేలతో సమావేశమైన సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా పార్టీల అధినేతలతో చర్చించిన కేసీఆర్ మరోసారి జాతీయ నేతలతో భేటీ కానున్నారు. ముందుగా లోక్సభ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఎవరికి వారు తమ విజయావకాశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. ఫలితాలు వచ్చేలోగా ఫెడరల్ ఫ్రంట్ ను క్రియాశీలకంగా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో రాష్ట్రాల పర్యటనపై ఫోకస్ పెట్టారు.
