సీఎం కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు. ఐదు రోజులు జరుగుతుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఎర్రవల్లి క్షేత్రం మార్మోగుతోంది. సీఎం కేసీఆర్ ఎందుకు ఈ చండీయాగం చేస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారు. ఈ యాగంతో వచ్చే ప్రయోజనాలు ఏంటీ అనేది చూద్దాం…
చండీ యాగం ఎందుకు చేస్తారంటే :
విశ్వ కల్యాణం, ప్రజా శ్రేయస్సు కోరుతూ రాజులు, చక్రవర్తులు, మునీశ్వరులు పూర్వకాలంలో యాగాలు నిర్వహించేవారు. అగ్నిదేవుడి సాక్షిగా హవిస్సులు సమర్పిస్తే.. దేవతలు సంతృప్తి చెందుతారని యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. ఐతిహాసిక ప్రాశస్త్యం ఉన్న మహాక్రతువుల్లో చండీయాగం ప్రముఖమైంది. సకల దేవతా స్వరూపిణిగా పూజలందుకుంటున్న దుర్గామాతయే చండీ పరదేవత. చండి మాతను ధ్యాన, ఉపాసనా మార్గాల్లో చండి, నవ చండి,సహస్ర చండి, ఆయుత చండి, లక్షచండి యాగం కూడా చేస్తూ ఉంటారు. 64 తంత్ర గ్రంధాల్లో చండీ యాగం గురించి వివరించటం వల్ల ఎవరు ఏగ్రంధాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న దానిపై యాగం పేరు నిర్ణయిస్తారు. ఎక్కడ చండి ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు, లోక కళ్యాణార్ధం సర్వజన హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహితలో పేర్కోన్నారు.
చండీయాగం ఎలా చేస్తారంటే :
చండి యాగం గురించి తేలికైన భాషలో చెప్పాలంటే… ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీయాగం. యజ్ఞ యాగాదులు నిర్వహించేటప్పుడు ఏ ఉద్దేశంతో సంకల్పం చెప్పుకుంటామో అదే అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు సీఎం కేసీఆర్ లోక కళ్యాణార్ధం సహస్ర చండీ యాగం తలపెట్టారు. సంకల్పం మంచిదైతే మహోగ్రరూపధారిణి అయిన కాళీమాత కూడా కరుణామూర్తిగానే సాక్షాత్కరిస్తుంది. చండీయాగాన్ని నిర్వహించే వ్యక్తికి మనోసంకల్పం ధృడంగా ఉండాలి. మనసును స్థిరలగ్నంలో ఉంచుకోవాలి. కేసీఆర్ కు మనోసంకల్ప బలం ఎక్కువగా ఉండబట్టే ఆయన చండీయాగాలను నిర్వహించగలుగుతున్నారు. మూడవసారి చండీయాగం తలపెట్టగలగడం ఓ విశేషం.
చండీయాగాన్నిసాధకులు రెండు రకాల ఆచారాల్లో నిర్వహిస్తుంటారు. 1. వామాచారం పధ్దతి, 2. దక్షిణాచార పధ్దతి. వామాచార పద్ధతిలో రక్త, మాంసాది నైవేద్యాలు, శ్మశానంలో పూజల్లాంటివి ఉంటాయి. ఇక దక్షిణాచారం ప్రకారం బలి ఇవ్వడానికి బదులుగా కొబ్బరికాయలు కొడతారు. రక్త మాంసాది నైవేద్యాలకు బదులుగా పళ్లు, పండ్ల రసాలు సమర్పిస్తారు. పరిమళ ద్రవ్యాలు, పవిత్రజలాలు ఉపయోగిస్తారు. ఉపాసకులు ఎలాంటి మార్గం ఎంచుకుంటారన్నది వారివారి ఆలోచనలనుబట్టి ఉంటుంది. అమ్మవారి దయ మాత్రం ఒకేవిధంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
చండీ యాగం ఫలితం ఏంటీ :
సత్సంకల్పంతో యాగం చేయటం వల్ల రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. యుగధర్మం ప్రకారం మంచి కంటే చెడు ఎక్కువగా రాజ్యమేలుతోంది. సమాజంలో మంచి పెరిగి ప్రజల మధ్య సుహృద్భావ వాతవరణం పెంపొందటానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటానికి, కరువు కాటకాలు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉండటానకి రాజు అయిన వ్యక్తి చండీ హోమంచేయటం సర్వదా శ్రేయస్కరం అని పండితుల అభిప్రాయం.
చండీ హోమం గురించి క్లుప్తం గా చెప్పాలంటే విఘ్నేశ్వరుడి పూజతో యాగం ప్రారంభం అవుతుంది. యాగం నిర్విఘ్న సమాప్తికి గణపతి మోదక హవనం చేసి మహాసంకల్పం చేస్తారు. పంచగవ్య ప్రాశన చేసి యాగశాల మంటపాన్ని శుద్ధి గావిస్తారు. అనంతరం రుత్విగ్వరణ గావిస్తారు. యాగ నిర్వహణకు వచ్చిన బ్రాహ్మణులు చతుర్వేద పారాయణ, దేవీ భాగవత పారాయణ, కుంకుమార్చన మహారుద్ర పునశ్చరణాదులతో పాటు రుత్వికులంతా ఏక కంఠంతో సప్తశతీ పారాయణాన్ని ఏకోత్తర వృద్ధి క్రమాన్ని అనుసరిస్తూ నాలుగు రోజులు నిర్దేశించిన సంఖ్యను పూర్తి చేస్తారు. ఐదో రోజున పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు.