లాల్ దర్వాజా మహంకాళి అమ్మ దేవాలయంపై రాజకీయ రగడ అలుముకుంది. అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తును సీఎం కేసీఆర్ నిధులు కేటాయించటంతో ఓల్డ్ సిటీలో కొలువైన లాల్ దర్వారా మహంకాళి అమ్మవారి ఆలయంపై రాజకీయం హీటెక్కింది. దీనికంతటికీ కారణం ఏమిటంటే..ముస్లిం పార్టీ అయిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ అమ్మవారి దేవాలయానికి నిధులు కేటాయించమని అడగటంతో ప్రారంభమైంది. ఆయన అడగటం..కేసీఆర్ వెంటనే స్పందించి నిధులు భారీగా కేటాయించట పెద్ద వివాదంగా మారింది. అమ్మవారి ఆలయం రాజకీయ రగడకు కేంద్రంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. లాల్ దర్వారా మహంకాళి అమ్మవారి ఆలయాన్ని విస్తరించాలని కోరడంతోనే సీఎం కేసీఆర్ ఏకంగా రై.10 కోట్లు కేటాయించారు. సాధారణంగా ఇలాంటి నిర్ణయం వెలువడగానే హిందువులు సంతోషిస్తారు. హిందూత్వ భావాలున్న బీజేపీ అయితే.. హర్షం వ్యక్తం చేయాలి. కాని, ఇక్కడ సీన్ రివర్స్లో జరుగుతోంది. అడగ్గానే ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేస్తున్నారంటూ ప్రశ్నించింది బీజేపీ. దీనంతటికీ కారణం.. ఆ గుడిని అభివృద్ధి చేయాలని స్వయంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అడగడమే. పైగా ఈ మొత్తం వ్యవహరాన్ని ప్రశ్నిస్తున్నది ఎవరో కాదు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.
పాతబస్తీలో కొలువైన లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారం. తెలంగాణలో బోనాల పండుగ వచ్చిందంటే.. మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటారు. చార్మినార్కు సమీపంలో ఉండే ఈ మహంకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణనే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. బోనాలు జరిగే సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు వస్తారు. కాని, ఈ ఆలయ పరిసరాలు మాత్రం భక్తుల రద్దీకి అనుగుణంగా మాత్రం లేదు. రెండు రోడ్ల మధ్య.. ఇరుకైన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. దీంతో బోనాలప్పుడు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేసీఆర్ హామీ..
అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు సీఎం కేసీఆర్ వచ్చిన సమయంలో.. ఆలయాన్ని అభివృద్థి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ దిశగా అడుగులు పడలేదు. అయితే, రీసెంట్గా లాల్ దర్వాజ మహంకాళి టెంపుల్పై ఓ విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. ఎలాగూ సీఎం కేసీఆర్ హామీ కూడా ఇచ్చి ఉండడంతో.. అక్బరుద్దీన్ విజ్ఞప్తిని వెంటనే అంగీకరించారు. మహంకాళీ ఆలయానికి పది కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఎంఐఎం, టీఆర్ఎస్ను టార్గెట్ బీజేపీ :
అక్బరుద్దీన్ అడగడం, సీఎం కేసీఆర్ వెంటనే అంగీకరించడం.. విచిత్రంగా పొలిటికల్ హీట్కు కారణమైంది. ఎంఐఎం, టీఆర్ఎస్ను బీజేపీ టార్గెట్ చేస్తోంది. హిందూత్వంపై ఎప్పుడూ విషం కక్కే ఓవైసీ.. ఇప్పుడు మహంకాళి ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంఐఎం అభ్యనను సీఎం కేసీఆర్ నిర్ణయంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ముస్లిం ఎమ్మెల్యే అక్భరుద్ధీన్ కు అమ్మవారి దేవాలయం గురించి అడిగే హక్కు ఎక్కడిది అంటూ ప్రశ్నించారు. గతంతో గోవులు, హిందువులపై చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ క్షమాపణ చెప్పిన తర్వాత.. ఆలయం గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంఐఎంకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారనీ..బీజేపీ నేతలకు గానీ..ఎమ్మెల్యేలకు గానీ అస్సలు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.