NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఇవాళ భారీ నిరసన ర్యాలీ చేపడుతోంది. జనవరి 4వ తేదీన జరిగిన మిలియన్ మార్చ్కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి.
NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఇవాళ భారీ నిరసన ర్యాలీ చేపడుతోంది. మహా తిరంగా ర్యాలీకి ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునివ్వడంతో.. మొన్న 4వ తేదీన జరిగిన మిలియన్ మార్చ్కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి. పాతబస్తీ, మెహిదీపట్నం, మల్లేపల్లి, మలక్పేట్, ముషీరాబాద్, నాంపల్లితో పాటు వివిధ బస్తీల నుంచి జనం మీరాలం ఈద్గా వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి సమూహంగా బయలుదేరి హసన్నగర్, ఆరాంఘర్, మైలార్దేవ్పల్లి, శాస్త్రిపురం, కింగ్స్కాలనీ, బాబా కాంటా వరకు ర్యాలీ ఉంటుంది. అక్కడ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించనున్నట్లు సమాచారం. దీనికోసం హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
NRC, CAAకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. 25న చార్మినార్ వద్ద భారీ బహిరంగ సభ ముషాయిరా జరుగుతుందన్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే చార్మినార్ ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా చేపడతామని ప్రకటించారు. 30వ తేదీన గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని మహ్మద్లైన్ ఆయిల్ మిల్ నుంచి బాపూఘాట్ వరకు మానవహారం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు.
ఎంఐఎం ర్యాలీ నేపథ్యంలో శంషాబాద్, కాటేదాన్ మార్గాల నుంచి వచ్చే వాహనదారులను బహదూర్పురా, జూపార్కుల వైపు వెళ్లడానికి అనుమతించరు. ఆ మార్గాల నుంచి వచ్చే వారు ఆరాంఘర్ క్రాస్రోడ్డు నుంచి మెహిదీపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆరాంఘర్ జంక్షన్, కాటేదాన్ నుంచి వెట్లేపల్లి గేటు, శాస్ర్త్రిపురం వెళ్లే వాహనదారులు చంద్రాయణగుట్ట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. రాజేంద్రనగర్, ఆరాంఘర్ నుంచి వచ్చే వాహనాలను కిషన్బాగ్, బహదూర్పురా వైపు అనుమతించరు.
వారు పిల్లర్ నంబర్ 202 వద్ద డైవర్షన్ తీసుకొని మెహిదీపట్నం మీదుగా వెళ్లాలి. మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలను కిషన్బాగ్, బహదూర్పురా వైపు అనుమతించరు. వారు పిల్లర్ నెంబర్ 143 హైదర్గూడ వద్ద ఆరాంఘర్మీదుగా వెళ్లాలి. ఆయా ప్రాంతాల్లో గమ్య స్థానాలకు చేరే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లాలని కోరారు.