ఏమైపోయారు : ఒకే కుటుంబంలో ముగ్గురు అదృశ్యం

  • Publish Date - December 17, 2019 / 04:59 AM IST

హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం అయిన ఘటన హయత్ నగర్ లో జరిగింది. హయత్ నగర్ కు చెందిన శ్రీధర్ రెడ్డి ప్రశాంతి, అశ్విత్  కనిపించట్లేదంటూ వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 30న శ్రీశైలం వెళ్లిన ఈ ముగ్గురు తిరిగి ఇంటికి రాలేదంటూ శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపారు. శ్రీధర్ రెడ్డి ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

పుట్టిన రోజు ఉందని శ్రీశైలం వెళ్లిన తన కొడుకు, కోడలు, మనవడు నెల రోజులుగా కనిపించడం లేదని ఓ మహిళ హయత్‌నగర్‌ పోలీసులకు సోమవారం (డిసెంబర్ 16) ఫిర్యాదు చేసింది. హయత్ నగర్ లోని శాంతినగర్‌లో నివాసం ఉండే కంది జయమ్మ కుమారుడు కంది శ్రీధర్‌రెడ్డికి 2017లో ప్రశాంతితో వివాహం జరిగింది. వీరికో బిడ్డ 
ఉన్నారు. నవంబర్ 30న శ్రీధర్‌రెడ్డి తన భార్యా బిడ్డతో కలిసి శ్రీశైలం వెళ్లారు. మూడు రోజుల వరకు ఫోన్‌లో మాట్లాడిన వారు ఆ తరువాత ఫోన్‌ చేయలేదు. 

డిసెంబర్‌ 5న తనకు శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ చేసి శ్రీశైలంలోనే ఉన్నామని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడని తల్లి జయమ్మ హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు నుంచి నేటి వరకు కొడుకు, కోడలు ఫోన్‌ చేయలేదని తెలిపింది. విచారణ జరిపి తమవారి ఆచూకీ కనిపెట్టాలంటూ ఆమె పోలీసులను కోరింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.