టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఈ మెయిల్స్ను పోలీసులు తనిఖీలు చేయగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఈ మెయిల్స్ బయటపడగా.. రవిప్రకాశ్, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసం చేసిన కుట్ర అని, పాత తేదీతో నకిలీ షేర్లు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులలకు సాక్షాలు లభించిన సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా రవిప్రకాశ్, న్యాయవాది శక్తి, టీవీ9 మాజీ సీఎఫ్వో మూర్తి, అలాగే మోజో టీవీ చైర్మన్ హరి కిరణ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు.
పోలీసులు పరశీలించిన ఈ ఈ-మెయిళ్ల ద్వారా కొత్తగా మోజో టీవీ చైర్మన్ హరికిరణ్ వెలుగులోకి వచ్చారు. టీవీ9కి సంబంధించిన నిధులను మోజోకు డైవర్ట్ చేశారనేది ప్రథాన ఆరోపణ ప్రచారంలో ఉండగా.. మోజో టీవీ చైర్మన్ హరికిరణ్కు వీరికి మధ్య మెయిళ్లు నడవడంతో ఆ వాదనకు బలం చేకూరినట్లు అయింది. దీంతో మోజో టీవీ కూడా కుట్రలో భాగం అని పోలీసులు భావిస్తున్నారు. టీవీ9 నుంచి మోజోకు నిధుల మళ్లింపు జరిగిందని, రవిప్రకాశ్ మోజోకు సంబంధం లేకుంటే… మెయిళ్లు ఎందుకు చేసినట్లు.. అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవిప్రకాశ్ మోజోను నడుపుతారని గతకొన్నిరోజులుగా ప్రచారం ఉంది. అలాగే టీవీ9కి తెలియకుండా మోజో వేతనాలు కూడా రవిప్రకాశ్ ఇచ్చారని, అలాగే వెబ్సైట్లు, గ్రాఫిక్ సంస్థలకు రవిప్రకాశ్ నిధులు ఇచ్చారనేది ఆరోపణ.